బాలయ్య తో మళ్లీనా ?

బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా హ్యాట్రిక్ ప్రాజెక్టుకు సన్నాహాలు పూర్తవుతున్నాయి. గత నాలుగైదు సినిమాలతో సీనియర్ హీరో బాలకృష్ణకు పరాజయాలు తప్పకపోవడంతో హిట్టు కాంబోగా పేరుపడిన ఈ ప్రాజెక్టుపై ఫ్యాన్స్ పెద్ద ఆశలు పెట్టుకున్నారు. తన సినిమాల్లో మేకోవర్‌కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే బాలకృష్ణ సైతం ఈసారి కంటెంట్ విషయంలోనూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడిగా బోయపాటి గ్రాఫ్ సైతం తిరోగమనంలో ఉండటంతో కమర్షియల్ హిట్టుతో బౌన్ బ్యాక్ కావడానికి ఈ ప్రాజెక్టుతో అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తోంది.

ఫిబ్రవరి 15 నుంచి రెగ్యులర్ షూట్‌కు వెళ్లేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ప్రాజెక్టుకు సంబంధించి అనధికార అప్‌డేట్ ఒకటి ఆసక్తి రేకెత్తిస్తోంది. బాలకృష్ణకు జోడీగా శ్రీయాశరణ్‌ను ఎంపిక చేసుకున్నారన్న కథనాలు ఓపక్క వినిపిస్తుంటే, ఆసక్తికరమైన ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో బాలయ్యకు జోడీగా నయనతార కనిపించనుందంటూ కథనాలు వస్తున్నాయి.

ఈ పాత్ర కోసం నయన్‌ను అప్రోచ్ కావడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నదే తాజా సమాచారం. ఇటు శ్రీయ, అటు నయనతార ఇద్దరూ గత చిత్రాల్లో బాలకృష్ణకు జోడీగా కనిపించి హిట్లందుకున్నావారే. బాలయ్య -బోయపాటి హిట్ కాంబో ప్రాజెక్టులో శ్రీయ, నయన్‌లతో హిట్ పెయిర్ సెట్ కావడంతో సినిమా బజ్ పెరగటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.