నిన్న సుక్కు .. నేడు వంశీ పైడిప‌ల్లి?

మ‌హేష్ క్రేజీ డైరెక్ట‌ర్‌ల‌తో ఆడుకుంటున్నాడా?.. త‌న‌కు న‌చ్చలేద‌ని ఇష్టం వ‌చ్చిన‌ట్టు డైరెక్ట‌ర్‌ల‌ని మార్చేస్తున్నాడా? అంటే జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూసిన ఇండ‌స్ట్రీ జ‌నాలు నిజ‌మే అంటున్నారు. `మ‌హ‌ర్షి` త‌రువాత మైత్రీలో మ‌హేష్ హీరోగా కొత్త క‌థ‌తో ఓ భారీ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురావాల‌ని సుకుమార్ ప్లాన్ చేశాడు. మ‌హేష్ కోసం రాత్ర‌న‌కా ప‌గ‌ల‌న‌కా శ్ర‌మించాడు. త‌న టీమ్‌నీ క‌ష్ట‌పెట్టాడు. చివ‌రికి ఓ సాలీడ్ క‌థ‌ని సిద్ధం చేశాడు. క‌ట్ చేస్తే మ‌హేష్ ఆ క‌థ త‌న‌కు న‌చ్చ‌లేద‌ని, మ‌ళ్లీ మార్చాల‌ని సింపుల్‌గా చెప్పేశాడు.

సుక్కు విన‌లేదు. దీంతో ప్రాజెక్ట్‌ని క్యాన్సిల్ చేశాడు మ‌హేష్‌. ఆ విష‌యాన్ని సోష‌ల్ మీడియా ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు కూడా. కొన్ని సృజ‌నాత్మ‌క విభేధాల కార‌ణంగా సుక్కుతో ప్రాజెక్ట్ చేయ‌డం లేద‌ని ప్ర‌క‌టించాడు. మ‌హేష్ చేసిన ప‌నికి ఎక్క‌డో కాలిన సుకుమార్ వెంట‌నే అల్లు అర్జున్‌కు క‌థ వినిపించాడు. అక్క‌డి నుంచి వెంట‌నే ఓకే అనే స‌మాధానం, ఆ వెంట‌నే మీడియా ప్ర‌క‌ట‌న చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. ఇప్పుడు మ‌రో ద‌ర్శ‌కుడి వంతు వ‌చ్చింది. సుకుమార్‌ని ప‌క్క‌న పెట్టి అనిల్ రావిపూడిని లైన్‌లోకి తీసుకొచ్చిన మ‌హేష్ అత‌నితో `స‌రిలేరు నీకెవ్వ‌రు` సినిమా చేసి ఈ సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే.

ఈ సినిమా హిట్‌తో మంచి జోష్ మీదున్న మ‌హేష్ త‌న త‌దుప‌రి చిత్రాన్ని వంశీ పైడిప‌ల్లితో చేయ‌బోతున్నాన‌ని సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా ఇంట‌రాక్ష‌న్‌లో చెప్పేశాడు. కానీ ఇప్పుడు క‌థ అడ్డం తిరిగింది. `స‌రిలేరు నీకెవ్వ‌రు`రిలీజ్ త‌రువాత వెకేష‌న్‌కి ఫ్యామిలీతో క‌లిసి యూఎస్ వెళ్లిన మ‌హేష్‌కు మైత్రీ మూవీస్‌కు చెందిన న‌వీన్ ఎర్నేని ప‌ర‌శురామ్ క‌థ‌ని వినిపించాడ‌ట‌. దీంతో వంశీ పైడిప‌ల్లి చిత్రాన్ని ప‌క్క‌న పెట్టిన‌ట్టు తెలుస్తోంది. ఇందులో మ‌హేస్ ఓ గ్యాంగ్‌స్ట‌ర్‌. సినిమా పాన్ ఇండియా స్థాయిలో వుండాల‌ని భారీగా ప్లాన్ చేశారు. దిల్ రాజు నిర్మాత‌. అయితే క‌థ విన్న మ‌హేష్ న‌చ్చ‌లేద‌ని, ఈ ప్రాజెక్ట్ త‌రువాత చేద్దామ‌ని చెప్పి వంశీకి షాకిచ్చాడ‌ని ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో వినిపిస్తోంది.