కరోనా సినిమాని మార్చేస్తోంది !

టాలీవుడ్‌ కి కరోనా వైరస్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ మొత్తం చిక్కుల్లో పడిందనేది వాస్తవం. టాలీవుడ్‌ లో ఏకంగా 70 సినిమాలు ఆగిపోయాయని ఇండిస్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో వందల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడులు ఇరుక్కుపోయాయి . రాజ‌మౌళి 300 కోట్ల రూపాయ‌ల ఆర్ ఆర్ ఆర్ ప్రాజెక్ట్, మెగాస్టార్ – ఆచార్య‌, ప్ర‌భాస్ – జాన్, పవర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌- వ‌కీల్ సాబ్.. ఇలా చెప్పుకుంటూ పోతే పలు ప్రాజెక్ ట్‌ల విలువే వందల కోట్ల రూపాయ‌లు ఉంటాయి. ఈ నేప‌ధ్యంలో సినీ పరిశ్రమ భవిష్యత్ గురించి ఇప్పుడే ఓ అంచనా రావటం కష్టమేనని షూటింగ్స్ కూడా మొదలుపెట్టడానికి భయపడుతున్నారు సినీ పెద్ద‌లు.

ప్ర‌తి ఏటా టాలీవుడ్ సుమారు 200 సినిమాలకు పైగా తెరకెక్కుతాయి. లాక్‌ డౌన్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ నష్టాలు ఎంత మేర ఉంటాయనేది ఇప్పుడే అంచనా వేయలేమ‌ని.. ఇది పరిశ్రమకు మాత్రం పెద్ద దెబ్బగా మిగలబోతుందనేది వాస్తవం. ఇక లాక్‌డౌన్ ఎత్తేసినా ఇఫ్పటికిప్పుడు సినిమా హాళ్ళకు అనుమతులు ఇవ్వటం అసాధ్యమే. ఓవరాల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే సినీ పరిశ్రమకు సంబంధించి ఒక ఆర్ధిక సంవత్సరం పూర్తిగా పోయినట్లే. మరి మధ్యలో ఆగిపోయిన సినిమాల స్థితి గురించి కాస్త ఆలోచించుకోవాల్సిందే.

సినీ పరిశ్రమ నష్టం ఒకెత్తు అయితే పరిశ్రమ పై ఆధారపడిన, వివిధ శాఖ‌ల్లో పనిచేసే సుమారు ఎనిమిది వేల మంది వరకు ఉపాధి కోల్పోయారు. మ‌రి ఈ క‌రోనా కాలం ఎప్పుడు ముగుస్తుందో, సినిమా కాలం ఎప్పుడు మొద‌ల‌వుతుందో చూడాలి. అయితే సినీ విశ్లేష‌కుల అంచానా ప్రకారం ఇలాగే మరో ఆరు నెలలు కొనసాగితే సినీ పరిస్థితులు పూర్తిగా మారిపోతాయనడంలో అనుమానం లేదు.