`అ!` సీక్వెల్‌పై క్లారిటీ వ‌చ్చేసింది!

ఏడు పాత్ర‌లు, ఓ ఫిష్‌, ఓ ట్రీ నేప‌థ్యంలో కొత్త త‌ర‌హా స్క్రీన్‌ప్లేతో వ‌చ్చిన చిత్రం `అ!`. ప్ర‌శాంత్ వ‌ర్మని ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ నేచుర‌ల్‌స్టార్ నాని ఈ చిత్రాన్ని నిర్మించాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్‌, నిత్యామీన‌న్‌, రెజీనా, ఇషా రెబ్బా, ప్రియ‌ద‌ర్శి, శ్రీ‌నివాస్ అవ‌స‌రాల‌, ముర‌ళీశ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. నాని ఫిష్‌గా, ర‌వితేజ ట్రీగా ఈ సినిమాకు న‌రేట‌ర్స్‌గా వాయిస్ ఓవ‌ర్ అందించారు. కొత్త త‌ర‌హాలో సినిమా వుండ‌టంతో విమ‌ర్శ‌కులు సైతం ఈ చిత్రంపై, నాని ప్ర‌య‌త్నంపై ప్ర‌శంస‌లు కురిపించారు.

ఈ చిత్రానికి త్వ‌ర‌లో సీక్వెల్ రాబోతోందంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. సీక్వెల్‌ని కూడా నానినే నిర్మిస్తాడని ప్ర‌చారం జ‌రిగింది. అయితే సీక్వెల్‌ని చేయ‌డానికి అటు నాని, ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్‌వ‌ర్మ ఆస‌క్తిగా లేర‌ని, తొలి భాగంలో న‌టించిన వాళ్లు కూడా సీక్వెల్‌పై అయిష్టంగా వున్నార‌ని ఇటీవ‌ల పుకార్లు షికారు చేశాయి. ఇది నిజ‌మేనేమో అని అంతా న‌మ్మేశారు. కానీ ఈ పుకార్ల‌కు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ చెక్ పెట్టేశారు. గుడ్ న్యూస్ `అ! 2` చేయ‌బోతున్నాం. త్వ‌ర‌లోనే షూటింగ్ మొద‌ల‌వుతుందని, త‌ను అంగీక‌రించిన కమిట్‌మెంట్స్ పూర్త‌వ‌గానే `అ! 2` ప్రారంభిస్తామ‌ని క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఈ సినిమాపై వ‌స్తున్న పుకార్ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టిన‌ట్ట‌యింది.