వైఎస్సార్టీపీ నుంచి పోటీ చేయనున్న వైఎస్ విజయమ్మ.?

ఖమ్మ జిల్లా పాలేరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. మరి, వైఎస్ విజయమ్మ ఏం చేయబోతున్నారు.? ప్రత్యక్ష రాజకీయాల్లో వైఎస్ విజయమ్మ మళ్ళీ కనిపిస్తారా.? అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే, తెలంగాణలో వైఎస్ విజయమ్మ పోటీ చేసే అవకాశాలు వున్నాయట. అది కూడా లోక్ సభకు ఆమె పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది.

2019 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ విశాఖ నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత చాలా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. చివరికి ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చింది. మొన్నటిదాకా ఆమె వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గౌరవాధ్యక్షురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే.

కానీ, ఇప్పుడామె ఆ పదవిలో లేరు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నారు వైఎస్ విజయమ్మ. అయితే, ఆమెకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ గౌరవాధ్యక్షురాలు.. అనే గుర్తింపు ఏమీ లేదు ప్రస్తుతానికి. ఖమ్మం నుంచి షర్మిల పోటీ చేయనుండగా, గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో విజయమ్మ పోటీ చేస్తే పార్టీకి మెరుగైన ఫలితాలు వుంటాయని షర్మిలకు వైటీపీ శ్రేణులు సూచిస్తున్నాయట.

వైఎస్ విజయమ్మ సైతం, లోక్ సభకు పోటీ చేయాలన్న ఆలోచనతోనే వున్నట్లు తెలుస్తోంది. కుదిరితే అటు అసెంబ్లీకి, ఇటు లోక్ సభకి కూడా విజయమ్మతో పోటీ చేయించే అవకాశాల్లేకపోలేదన్నది ఓ ఇంట్రెస్టింగ్ పొలిటికల్ గాసిప్.