వైఎస్సార్ ని కూడా కలవకపోయారా… షర్మిళను ఆడుకుంటున్నారుగా!

ఈ రోజుల్లో రాజకీయ నాయకులు, సెలబ్రెటీలు ఎవరైనా మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి, ఆచి తూచి మాట్లాడాలి. తొందరపాటులోనో, అత్యుత్సాహంలోనో పొరపాటున ఒక మాట జారినా, తడబడినా… ట్రోలర్స్ చేతిలో బలైపోవడం తప్పదు! ప్రస్తుతం వైఎస్ షర్మిళ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

అవును… గతంలో సోషల్‌ మీడియా లేని రోజుల్లో ఎలా మాట్లాడినా నడిచిపోయేది, పైగా నాయకులు మాట్లాడిన తప్పులను సవరించి మరీ పత్రికల్లో అచ్చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం అలా కాదు. తప్పు మాట్లాడితే దబిడి దిబిడే… నెటిజన్లు, మీమర్సు వాయించి వాయించి వదులుతుంటారు.

ఈ మద్యకాలంలో వైఎస్సార్సీటీపీ అధ్యక్షురాలు ట్రోలింగ్ కి ఎక్కువగా గురయ్యారు. నారా లోకేష్ తర్వాత స్థానంలో కొనసాగేటంతగా ట్రోల్స్ జరిగాయి. గతంలో.. “పాదయాత్ర అంటే ఏమిటి… పాదాల మీద నడిచే యాత్ర”, “వాళ్లను విద్యార్థులని అని ఎందుకంటున్నామంటే.. వారు యువత కాబట్టి”… అంటూ మాట్లాడిన షర్మిల భారీ ఎత్తున ట్రోలింగ్‌ గు గురయ్యారు.

ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి ట్రోలర్స్ చేతికి చిక్కారు వైఎస్ షర్మిళ. తాజాగా తన భర్త అనిల్‌ కుమార్‌ తో కలిసి ఢిల్లీ వెళ్లిన షర్మిళ… పార్టీ అగ్ర నేత సోనియా గాంధీని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ… సోనియా గాంధీని, ఆమెతోపాటు రాజీవ్‌ గాంధీని కలిసినట్లు చెప్పారు. దీంతో మరోసారి మొదలుపెట్టేశారు ట్రోలర్స్.

వాస్తవానికి 1991 మే 21 న రాజీవ్ గాంధీ మరణించారు. అలాంటి వ్యక్తిని తాజాగా ఢిల్లీలో కలిశానని షర్మిళ చెబుతున్నారు. దీంతో… “ఇందిరాగాంధీని కూడా కలకవపోయారా?” అని ఒకరు కామెంట్ చేస్తుంటే… పనిలో పనిగా “వైఎస్ రాజశేఖర్ రెడ్డిని, వైఎస్ వివేకానంద రెడ్డిని కూడా కలిసేయవలసింది” అని కామెంట్ చేస్తున్నారు.

ఇదే సమయంలో “రాజీవ్ గాంధీ ఎలా ఉన్నారక్కా” అని ఒక నెటిజన్ అడగగ్గా… “రాబోయే ఎన్నికల రిజల్ట్ ఏమైనా చెప్పారా” అంటూ మరొకరు కామెంట్ చేశారు. దీంతో… మరోసారి ట్రోలర్స్ కి దొరికిపోయారు అంటూ షర్మిళపై కామెంట్లు వినిపిస్తున్నాయి.

వాస్తవానికి సోనియా గాంధీతో పాటు రాహుల్‌ గాంధీని కూడా కలిశాను అని చెప్పడం షర్మిల ఉద్దేశం కావచ్చు. పొరపాటున రాజీవ్‌ గాంధీని కలిశానని చెప్ప్పి ఉండొచ్చు. కానీ… ఆ ఛాన్స్ ని ట్రోలర్స్ మిస్ చేసుకోరన్న విషయం గమనించాలి. అందుకే మీడియా ముందు ఆచి తూచి మాట్లాడాలి. లేదంటే… ట్రోలింపే!