ఎన్నికల్లో రాయలసీమ వాసుల దారెటు?

(యనమల నాగిరెడ్డి)

ప్రస్తుతం జరుగనున్న తెలంగాణా ఎన్నికలలో రాయలసీమ వాసులు టిఆర్ఎస్ కు మద్దతు పలకాలని “గ్రేటర్ రాయలసీమ సంఘం” తెలంగాణ శాఖ నాయకులు చేసిన ప్రకటన వివాదాస్పదం అయింది. రాయలసీమ వాసులు దొంగలని, పోతిరెడ్డిపాడు ద్వారా కృష్టా నది నీళ్లు దొంగలిస్తున్నారని ఆరోపిస్తూ ఆగం చేస్తున్న టిఆర్ఎస్ కు మద్దతు పలకడంలో ఔచిత్యమేమిటని సీనియర్ సిపిఐ నాయకుడు, కడప జిల్లా వాసి శ్రీ లక్షిమినారాయణ గారు ప్రశ్నించారు.

రాయలసీమ ద్రోహులకు ఓట్లు వేయరాదని నోటాకు వేయవచ్చునని ఆయన చేసిన ప్రకటన హర్షణీయం. ఎవరికీ ఓటు వేయాలి? అన్న విషయం నిర్ణయించడానికి ముందు “ ఎవరు రాయలసీమ ద్రోహులో” తేల్చుకోవాల్సి ఉంది.

రాయలసీమకు జరిగిన ద్రోహం ఏమిటి? కారకులెవరు? అన్న అంశాలపై ఈ చిన్న వివరణ.

రాయలసీమ ప్రజలు ఎవరికీ ఓటు వేయాలి?

రాయలసీమ ప్రజలు ఎవరికీ ఓటు వేయాలి అన్న అంశాన్ని నిర్ణయించవలసి వస్తే “రాయలసీమకు పోరాడే పార్టీకి మాత్రమే” ఓటు వేయాలి. సీమ ద్రోహులకు ఓటు వేయకూడదు అని అనుకుంటే ప్రజలు మొదటి కాంగ్రెస్ కు, ఆ తర్వాత టీడీపీకి, వైస్సార్ కాంగ్రెస్ కు ఓటు వేయకూడదు. ఇపుడు వేరే పార్టీ రాయలసీమను భుజానికి ఎత్తుకోలేదు కాబట్టి లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లు జనమంతా “నోటాకే” ఓట్లు వేయాల్సి ఉంటుంది.

రాయలసీమ ప్రజలు మన్సపూర్తిగా ఓట్లు వేయవలసి వస్తే మొదటి ఎన్టీఆర్ కు, వై. ఎస్ రాజశేఖర రెడ్డికి, సీమకోసం 1984-89 మధ్య ఉద్యమించి, అహోరాత్రాలు శ్రమించిన మైసూరా రెడ్డి, సి.హెచ్ చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్లకు మాత్రమే ఓట్లు వేయవలసి ఉంటుంది. మిగిలిన నాయకులలో ఎవరికీ సీమ ప్రజల ఓట్లు అడిగే అర్హత లేదు.

రాజకీయ పార్టీల విషయం

రాజకీయ పార్టీల విషయానికి వస్తే రాయలసీమ ప్రజలు మొదట వ్యతిరేకించవల్సింది “కాంగ్రెస్ ను.” ఆ తర్వాత స్తానం టీడీపీకి దక్కుతుంది. ఇక రాయలసీమకు ఎంతో అన్యాయం జరిగిందని సన్నాయి నొక్కులు నొక్కుతున్న కమ్యూనిస్టులు, బీజేపీ లాంటి పార్టీలను వ్యతిరేకించాల్సి వస్తుంది. చివరగా ప్రతిపక్ష స్థానంలో ఉండి కూడా సీమకు జరుగుతున్న అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించలేని వైస్సార్ కాంగ్రెస్ ను తిరస్కరించాల్సి వస్తుంది.

కాంగ్రెస్ –టీడీపీలు

1937 లో శ్రీ భాగ్ ఒప్పందం మేరకు “రాయలసీమ నీటి అవసరాలు తీరిన తర్వాతనే మిగిలిన ప్రాంతాలకు నీళ్లివ్వాలని” కుదుర్చుకుని, అమలు చేయకుం డా “అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీఠ వేసి” రాయలసీమకు తీరని ద్రోహం చేసి, నాగార్జునసాగర్ ను నిర్మించడం, సీమలో నిర్మించిన శ్రీశైలంను స్టోరేజి(తోక) ప్రాజెక్ట్ గా మార్చింది కాంగ్రెస్ మాత్రమే. కర్నూల్ నుండి రాజధానిని తరలించిన తరువాత సీమ అభివృద్ధికి గండి కొట్టింది కూడా కాంగ్రెసే.

రాష్ట్ర విభజన సమయంలో రాయలసీమ ను ఆదుకోవడానికి ప్రతిపాదించిన “దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్”ను ప్రక్కన పెట్టి “పోలవరమే” ఎపికీ వరమని జాతీయ ప్రాజెక్ట్ చేసింది కాంగ్రెస్సే.

టీడీపీ నిర్మాత స్వర్గీయ ఎన్.టి.రామారావు “రాయలసీమ ఉద్యమానికి స్పందించో, లేక ఈ ప్రాంత దుస్థితి చూసో” ప్రారంభించిన “తెలుగు గంగ, గాలేరు-నగిరి,హంద్రీ-నీవా, వెలిగొండ” ప్రాజెక్టలే నేడు సీమకు దిక్కయ్యాయి. ఆ తర్వాత 1996లో ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన చంద్రబాబు ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసింది సూన్యమనేది జగమెరిగిన సత్యం. ప్రస్తుతం చేస్తున్న అన్యాయం కూడా చెప్పలేనంత. ప్రస్తుతం బాబు నాయకత్వంలోని టీడీపీ రాయలసీమకు చేస్తున్న ద్రోహాన్ని గురించి “ చెపితే చాట భారతమే” అవుతుంది.

వైస్సార్ కాంగ్రెస్

కాంగ్రెస్ ముఖ్యమంత్రి గా దివంగత వై. ఎస్. రాజశేఖర రెడ్డి రాయలసీమ ప్రాజెక్ట్ లను పూర్తి చేయడానికి బద్ద కంకణుడై విశేషంగా కృషి చేసి దాదాపు పూర్తి చేశారు. ఆ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభత్వం పట్టించుకోకపోయినా, తగినన్ని నిధులు విడుదల చేయక పోయినా వైస్సార్ వారసుడిగా రాజకీయ నాయకత్వం కోరుకుంటున్న జగన్ సీమ అవసరాల కోసం యుద్ధం చేయడంలో విఫలమయ్యారని చెప్పక తప్పదు.

పోతిరెడ్డిపాడు కాలువ

కృష్ణా నది నీళ్లను రాయలసీమకు మళ్లించడానికి కీలకమైన “పోతిరెడ్డిపాడు”కాలువను వెడల్పు చేస్తామని వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రకటించిన వెంటనే అడ్డుపడింది “హెదరాబాద్ బ్రదర్స్” గా గుర్తింపు పొందిన కాంగ్రెస్ నాయకులు పి.జనార్దన్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి. అదే పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా టీడీపీ నేత ఇప్పటి ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ “2005లో ప్రకాశం బ్యారేజి మీద ధర్నా”చేసారు. మరి తెలంగాణా నీళ్ల కోసం పుట్టిన “టిఆర్ఎస్” వ్యతిరేకించడంలో ఆశ్చర్యం ఏముందో?

దుమ్ముగూడెం -నాగార్జున సాగర్ టెయిల్ పాండ్

దుమ్ముగూడెం వద్ద గోదావరి నుండి 163 టీఎంసీల నీళ్లు నాగార్జునసాగర్ టైల్ పాండ్ కు తరలించి నల్గొండజిల్లా, కృష్టా డెల్టా అవసరాలు తీర్చి, తద్వారా ఆదా అయ్యే నీటిని శ్రీశైలం నుండి రాయలసీమకు ఇవ్వాలని స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి ఓ పధకం వేసి, డిపిఆర్ తయారు చేయించి, రాష్ట్ర విభజన నాటికి సుమారు 500 కోట్లు ఖర్చు పెట్టారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదనను ఇటు రాష్ట్రం, అటు కేంద్రం పట్టించుకోలేదు.

విభజన సమయంలో నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్ట్ లు పూర్తి చేస్తామని ప్రకటించిన కేంద్రంలోని కాంగ్రెస్, దీనికి సంపూర్ణ మద్దతు ప్రకటించి ఆ తర్వత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ పధకాన్ని గురించి, నిర్మాణంలో ఉన్న ఇతర ప్రాజెక్ట్ లను గురించి ఆలోచించనే లేదు.

2014 నవంబర్ ప్రాంతంలో ఈ ప్రాజెక్టునిర్మాణంపై ఎపి ప్రభత్వ వైఖరి తెలపాలంటూ తెలంగాణా నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు ఏపీకి ఉత్తరం వ్రాసారని ఆంధ్రజ్యోతి ఒక వార్త రాసింది. ఆతీగతీలేని ఈ ప్రాజెక్టు ఏమైందో ఎపి ప్రభుత్వమే చెప్పాలి.

బచావత్ ట్రిబ్యునల్

1976లో బచావత్ ట్రిబ్యునల్ రాయలసీమకు కేటాయించిన 122. 7 టీఎంసీలు కానీ, తర్వాత ఎస్.ఆర్.బి.సికి కేటాయించిన 19 టీఎంసీలు నీరు నేటికీ పూర్తిగా రాయలసీమ గొంతు తడపడంలేదు. అవసరమైన స్థిరీకరణ ప్రాజెక్టులు ప్రభుత్వాలు నేటికీ చేపట్టలేదు. ట్రిబ్యునల్ రాష్టానికి ఉపయోగించుకునే హక్కు కల్పించిన మిగులు నీటిని రాయలసీమకు తరలించలేదు. అయితే “శ్రీశైలం జలాశయంలో ఆవిరిగా నష్టపోయే 15 టీఎంసీలను రాష్ట్రంలోని 3 ప్రాంతాలకు సమానంగా పంచారు. నష్టంలో సమాన వాటా ఇచ్చిన పెద్దలు సీమ అవసరాలకు మొండిచేయి చూపుతున్నారు.”

బ్రిజేష్ మిశ్ర ట్రిబ్యునల్

రెండు రాష్ట్రాలకు నీటి పంపకం కోసం ప్రస్తుతం పని చేస్తున్న బ్రిజేష్ మిశ్ర ట్రిబ్యూనల్ ఎదుట తెలంగాణ తన వాదనలు బలంగా వినిపిస్తున్నది. ఎపి ప్రభుత్వం తరఫున నీటి పారుదల రంగ నిపుణుడు శ్రీ విశ్వేశ్వర రావు ఇచ్చిన సాక్ష్యం మేరకు 1972-73 నుండి 2004-2005 వరకూ తెలంగాణా కంటే రాయలసీమకు అధికంగా నీళ్లు ఇచ్చారట. (కె.సి. కెనాల్ క్రింద ఎన్ని సంవత్సరాలు పంటలు సాగు కాలేదో? ప్రభుత్వ లెక్కలు చెప్పాలి).ఇకపోతే పట్టిసీమ నుండి కృష్ణ కు వస్తున్న 80 టీఎంసీలపై బడిన నీళ్లు డెల్టాకు చాలవని, అదనంగా సాగర్ నుండి 50 టీఎంసీలు, పులిచింతల నుండి 20 టీఎంసీలు కావాల్సి ఉంటుందని ఆయన సెలవిచ్చారు. ఈ సందర్భంలో రాయలసీమ ప్రాజెక్టులకు నీళ్లు ఇవ్వాల్సిన అవసరాన్ని గురించి ప్రభుత్వ సాక్షి ట్రిబ్యునల్ కు చెప్పలేదు. కారణం ప్రభుత్వానికే తెలియాలి.

సీమకు నీళ్లు

పోతిరెడ్డిపాడు నుండి భారీగా నీళ్లు సీమకు తరలించామని ప్రొద్దటూరు ధర్మపోరాట దీక్ష సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పగా , మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్ రెడ్డి “104 టీఎంసీల నీటిని కృష్ణ నుండి తెచ్చి 64 టీఎంసీలు సోమశిల కు” తరలించామని. ఇందులో సీమకు మిగిలింది ఏంతో మేధావులే చెప్పాలి.

ఎఐబిపి -ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన

రాష్ట్ర విభజన తర్వాత కేంద్రం, ఏపీకి “ఎఐబిపి” క్రింద ఇచ్చిన నిధులలో సీమకు ఒక్క రూపాయి కూడా దక్కలేదు. అలాగే “ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన” క్రింద నిర్మాణంలో ఉన్న 8 నీటి పారుదల ప్రాజెక్ట్ లను రాష్ట్రం ప్రతిపాదిస్తే, రాయలసీమకు చెందిన ఒక్క ప్రాజెక్ట్ కూడా సర్కారు దయకు నోచుకోలేదు.

ఇదే సమయంలో చంద్రబాబు ప్రభుత్వం కోస్తా ప్రాంతానికి ఉపయోగపడగల “పట్టిసీమ పూర్తి చేసి, పోలవరాన్ని శరవేగంతో నిర్మిస్తూ, వైకుంఠపురం, చింతలపూడి ఎత్తిపోతల, పురుషోత్తం పట్నం ఎత్తిపోతల పధకాలను” శరవేగంతో నిర్మిస్తున్నారు. గొదావరి-పెన్నా అనుసంధానం పేరుతొ మరో కంటి తుడుపు పధకం ప్రకటించారు. కానీ ప్రభుత్వానికి చేయగలిగిన సామర్థ్యము ఉండి కూడా రాయలసీమలోని ప్రాజెక్టులు పట్టించుకోవడం లేదని, “ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కడం” అంటే ఇదేనని జనాభిప్రాయం.

టిఆర్ఎస్ కు రాయలసీమ వాసులు మద్దతిస్తే తప్పేంటి?

రాజకీయ అవసరాల కోసం జన్మ విరోధులైన కాంగ్రెస్- టీడీపీ, టీడీపీ- కమ్యూనిస్టులు , టీడీపీ-బీజేపీ, టీడీపీ,కాంగ్రెస్- కమ్మ్యూనిస్టులు కలసిపోవచ్చు. కానీ ప్రక్క, ప్రక్కన ఉన్న కరువు ప్రాంత ప్రజలు కలవకూడదనడం న్యాయం కాదు. రాజకీయ పార్టీలు కలిస్తే ప్రజాస్వామ్య పరిరక్షణ. రెండుప్రాంతాల ప్రజలు కలిస్తే ప్రాంతీయ ద్రోహమనడం సమంజసం కాదు.

కలవని దాయాదులతో కలవడం కంటే, కనీసం”ఇరుగు పొరుగు వారితో నైనా కలిస్తే ప్రయోజనం ఉంటుందేమో నన్న ఆశతో, తమ స్థానిక పరిస్థితుల దృష్ట్యా” రాయలసీమ వాసులు టీఆరెస్ కు మద్దతు పలికినట్లుంది.

రాయలసీమ ద్రోహులకు ఓట్లు వేయకూడని స్థితి వస్తే ఆ కోవలో మొదటి స్తానం పొందే కాంగ్రెస్- టీడీపీ లకు ఓట్లు వేయకూడదనే అంశం పై ఈ విశ్లేషణ. సీనియర్ కమ్యూనిస్టు నాయకుడు, రచయిత శ్రీ లక్ష్మీనారాయణ సహృదయంతో ఈ వాదన అంగీకరిస్తారని ఆశిస్తున్నాను. .