రేవంత్ ఇంట్లో ఐటి దాడులపై ఎంపి కవిత రియాక్షన్ (వీడియో)

రేవంత్ రెడ్డి ఇంట్లో గురువారం ఉదయం నుంచి ఇన్ కం ట్యాక్స్ శాఖ దాడులు చేపట్టింది. 15 మంది ఐటి శాఖ అధికారులు ఏక కాలంలో రేవంత్ ఇంట్లో, బంధువులు, సన్నిహితుల ఇంట్లో దాడులు చేపట్టింది. ఉదయం నుంచి రాత్రి వరకు దాడులు కొనసాగాయి.

రేవంత్ నివాసంలో ఐటి దాడులపై కాంగ్రెస్ పార్టీ సీరియస్ అయింది. కేసిఆర్ కుసంస్కారంతో రేవంత్ ఇంట్లో ఐటి రైడ్స్ చేయిస్తున్నాడని ఆరోపించింది. బిజెపి సర్కారుతో కేసిఆర్ కుమ్మక్కై ఈ దాడులు చేయిస్తోందని ఆరోపించింది. రేవంత్ రెడ్డి కూడా ఐటి దాడులపై స్పందించారు. మిత్తీతో సహా అప్పచెప్త అన్నారు. 

కోస్గి సభలో తేడా వస్తే జైలుకు పోవాల్సి వస్తదని రేవంత్ భావోద్వేగంగా మాట్లాడారు. ఈ పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఇంటి మీద ఐటి దాడుల నేపథ్యంలో కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత స్పందించారు. నిజామాబాద్ జిల్లాలో ఆమెను మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు స్పందించారు. 

కేంద్రం పరిధిలో ఉన్న అంశం అన్నారు. ఈ దాడులతో మాకేం సంబంధం లేదని చెప్పారు. ప్రతిదానికి కేసిఆర్ చేయించాడని మాట్లాడడం సరికాదన్నారు. ఇంకా కవిత ఏమన్నారో కింద వీడియో ఉంది చూడండి.

 

 

కవిత ఇంకేం మాట్లాడారో కింద చదవండి.

అక్టోబర్ 3న నిజామాబాద్ లో సీఎం కేసీఆర్ పాల్గొనే ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లను నిజామాబాద్ ఎంపి కల్వకుంట్ల కవిత పరిశీలించారు. హైదారాబాద్ నుండి గురువారం నిజామాబాద్ వచ్చిన ఆమె నేరుగా సభ జరిగే గిరిరాజ్ కాలేజీ మైదానంకు వెళ్లారు.మైదానం చదును చేసే పనులను చూశారు. మాజీ తాజా మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, మేయర్ ఆకుల సుజాత తదితరులు కవిత వెంట ఉన్నారు. పోలీసు, రెవిన్యూ, ఇతర శాఖల అధికారులతో సభ ఏర్పాట్లు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

కెసిఆర్ సభలు పెట్టడం, భారీగా జనం తరలి రావడం కొత్తేమీ కాదని కవిత అన్నారు. సభకు తరలి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తక్కువగా ఉండే విధంగా చర్యలు తీసుకోవడం పైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించినట్లు ఆమె తెలిపారు. వారం రోజుల పాటు నిజామాబాద్ ఉంటానని, ఆశీర్వాద సభ సక్సెస్ కోసం ఏర్పాట్లు పర్యవేక్షిస్తానని తెలిపారు. 

కేసీఆర్ ను దగ్గరగా చూసేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారని, ఆయన చెప్పే మాటలు వినాలన్న ఆసక్తి ప్రజల్లో నెలకొన్న దృష్ట్యా ఆ విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు కవిత వివరించారు. 

మహిళలకు తక్కువ దూరంలో పార్కింగ్ సౌకర్యం కల్పిస్తామని, టాయిలెట్లు, అంబులెన్సు సౌకర్యాలను కూడా కల్పిస్తున్నట్లు కవిత తెలిపారు. హుస్నాబాద్ ప్రజా ఆశీర్వాద సభ తర్వాత మళ్లీ నిజామాబాదు లో సభ నిర్వహిస్తుండడం పట్ల ప్రజాప్రతినిధులుగా మాకు సంతోషం గా ఉందని అన్నారు. సీఎం ప్రజా ఆశీర్వాద సభ విజయవంతానికి పార్టీ శ్రేణులు పనిచేస్తున్నాయని కవిత తెలిపారు.

నిజామాబాద్ జిల్లా సక్సెస్ కు మారుపేరు అని అన్నారు. టిఆర్ఎస్ కు వెన్నెముకగా ఉండే జిల్లా నిజామాబాద్ జిల్లా అన్నారు. ఉద్యమం సమయం నుంచీ నేటి వరకు టిఆర్ఎస్ వెంటే జిల్లా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 100/100 సీట్లు గెలుస్తామన్నారు. అలాగే 9/9 అసెంబ్లీ సీట్లను గెలిచి కేసీఆర్ కు కానుకగా ఇస్తామన్నారు.
రిజల్ట్స్ తర్వాత రిసౌండింగ్ రిజల్ట్స్ వస్తాయని ఎంపీ కవిత తెలిపారు.