రోడ్డెక్కిన సీబీఐటి స్టూడెంట్స్…గండిపేటలో టెన్షన్ టెన్షన్

అక్రమ ఫీజులను వసూలు చేస్తూ వేధింపులకు గురిచేస్తున్న సీబీఐటి యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని, పెంచిన ఫీజులను తగ్గించాలని సీబీఐటి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు ఆందోళన బాటపట్టారు. కళాశాలలో చేరే సమయంలో పేర్కొన్న ఫీజలను చెల్లిస్తాం తప్ప పెంచిన ఫీజులను చెల్లించే ప్రసక్తే లేదని విద్యార్ధులు మూడు రోజులుగా ఆందోళన బాట పట్టారు. యాజమాన్యం దిగిరాకపోవడంతో ఏకంగా పరీక్షలను బహిష్కరించి మరీ విద్యార్దులు ఆందోళన చేపట్టారు. ఇంతకీ విద్యార్థుల ఆందోళనకు కారణమేంటంటే…

హైదరాబాద్ శివారులోని గండిపేట మండలకేంద్రంలో ఉన్న చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో మేనేజ్ మెంట్, ఎన్ ఆర్ ఐ, కోటాలో చేరిన విద్యార్థుల నుంచి రూ.1.20 లక్షల ఫీజు తీసుకుంటామని కళాశాల యాజమాన్యం విద్యార్దులు కళాశాలలో చేరే సమయంలో చెప్పింది. తెలంగాణ ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల విషయంపై తీసుకున్న చర్యలను వ్యతిరేకిస్తూ కొన్ని కళాశాలల వారు కోర్టును ఆశ్రయించారు.

కళాశాలలో అద్వానంగా ఉన్న టాయిలెట్స్ 

దీంతో హైకోర్టు కళాశాలల్లో అదనపు సౌకర్యాలు ఉన్న కళాశాలలకు అదనపు ఫీజు వసూలు చేసుకునే వీలు కల్పించింది. దాంతో కాలేజి యాజమాన్యం గత సంవత్సరం నుంచి విద్యార్ధుల వద్ద రూ.1.20 లక్షలకు బదులుగా కోర్టు సూచించిన విధంగా రూ. 2 లక్షలు వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో విద్యార్దులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. విద్యార్దుల ఆందోళనతో దిగి వచ్చిన యాజమాన్యం ఫీజు రీయింబర్స్ మెంట్ కోటాలో సీట్లు పొందిన  ఎ కేటగిరి విద్యార్ధుల నుంచి యథావిధిగానే ఫీజు వసూలు చేస్తామని వసూలు చేస్తామని సర్క్యూలర్ జారీ చేయడంతో అప్పట్లో విద్యార్దులు శాంతించారు. ఈ సంవత్సరం నుంచి యాజమాన్యం ఎన్ ఆర్ ఐ కోటాలో సీట్లు పొందిన బి కేటగిరి విద్యార్దుల నుంచి పెంచిన ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధులు గత నాలుగు రోజుల నుంచి ఆందోళన బాట పట్టారు. వేలాది మంది విద్యార్ధులు రోడ్డెక్కి ఆందోళన చేయడంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఫీజుల చెల్లింపుల విషయంలో ప్రశ్నించిన ఒక విద్యార్ధిని ప్రిన్సిపాల్ కొట్టడంతో పాటు మరో నలుగురు విద్యార్దుల దుస్తులు విప్పి బంధించారని విద్యార్ధులు ఆరోపించారు. కళాశాల విద్యార్దులు  ఆందోళన చేస్తున్న వీడియోలు కింద ఉన్నాయి చూడండి.

సీబీఐటి కళాశాలలో ఎప్పుడు కూడా అధిక ఫీజులు వసూలు చేస్తుందని విద్యార్దులు వాపోయారు. అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ నరకం చూపిస్తుందన్నారు. కళాశాలలో వసతులు కూడా అరకొరగానే ఉన్నాయని పెద్ద బ్రాండ్ గా చూపించి సీబీఐటి యాజమాన్యం దోచుకుంటుందని విద్యార్ధి సంఘాల నాయకులు అన్నారు. కళాశాల యాజమాన్యం విద్యార్దులకు ఇచ్చిన మాట ప్రకారమే ఫీజులు వసూలు చేయాలని లేని పక్షంలో పోరు మరింత ఉదృతం చేస్తామన్నారు.

విద్యార్దులను కొట్టిన ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ఎస్ ఎఫ్ ఐ నాయకులు డిమాండ్ చేశారు. సీబీఐటి విద్యార్దుల ఆందోళనతో కళాశాల అట్టుడుకుతుంది. పేరేంట్స్ సంఘాలు కూడా ఈ ఆందోళనలో పాల్గొంటున్నాయి. కళాశాల ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మొత్తానికి సీబీఐటి కళాశాల ఎదుట టెన్షన్.. టెన్షన్ వాతావరణం నెలకొంది. 

 

సీఐ కళాశాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ విద్యార్దులు విడుదల చేసిన వీడియో