టిఆర్ఎస్ బర్రె, కాంగ్రెస్ దున్నపోతు : తెలంగాణ మంత్రి కామెంట్స్

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ 75 శాతం సబ్సిడీ పై అందిస్తున్న గొర్రెలను, బర్రెలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ పొచారం శ్రీనివాస రెడ్డి. పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జుక్కల్ శాసనసభ్యుడు హన్మంత్ షిండే, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ ధఫేదార్ రాజు, జిల్లా కలెక్టర్, పాడి, పశుసంవర్ధక శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మంత్రి పొచారం స్పీచ్ ఇలా సాగింది. రైతు గ్రామంలో బొడ్డు రాయి అయితే దానిపై అన్ని రకాల కుల వృత్తులు ఆధారపడి ఉన్నాయి. భూమి దున్నే దగ్గర నుండి పండిన పంట దాచుకునే వరకు అన్ని కులాలు వ్యవసాయ సంబంధ పనులలో నిమగ్నమవుతారు. సమైక్య పాలనలో కుల వృత్తులు చిన్నాభిన్నం అయినయి. బతుకు దెరువుకు పొట్ట చేతపట్టుకోని పట్టణాలకు వలసపోయినారు.

సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం నేటి తెలంగాణ రాష్ట్రంలో జరగకూడదనేది ముఖ్యమంత్రి గారి సంకల్పం. అన్ని కులాలకు భారీ సబ్సిడీలు ఇచ్చి బ్రతకడానికి ఉపాది కల్పిస్తున్నాం. ప్రజలను ఆదుకోవాలని ఆలోచన చేస్తున్న ఎకైక ముఖ్యమంత్రి కేసీఆర్. గత 70 ఏళ్ళైలో అనుభవించిన బాధకు చరమగీతం పాడి 24 గంటల కరంటు ఇస్తున్నాం.

బర్లను పంపిణీ చేస్తున్న మంత్రులు పోచారం, తలసాని

ఈ వానాకాలంలో ఇప్పటి వరకు రాష్ట్రంలోని 50 లక్షల మంది రైతాంగంకు రైతుబంధు పథకం క్రింద రూ. 5778 కోట్లు పంపిణీ చేశాం. వచ్చే యాసంగిలో పంపిణీ కోసం రూ. 6000 కోట్లు సిద్దం చేశాం. రాష్ట్రంలోని మొత్తం రైతులలో 18 లక్షల మంది ఒక ఎకరం లోపు వారే. మొత్తం 50 లక్షల మంది రైతులలో 91 శాతం సన్న చిన్నకారు రైతులే.

18 నుండి 59 సంవత్సరాల మద్య ఉన్న 30 లక్షల మంది రైతులకు ప్రతి రైతుకు రూ. 2,271 ప్రీమియం ను ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతుబీమా మొదలైన అగస్టు 14 నుండి ఇప్పటి వరకు 300 మంది రైతులు చనిపోతే, 246 మంది ఖాతాలలోకి రూ. 5 లక్షలు జమ చేశాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7.50 లక్షల ఎకరాలకు ఏటా రెండు పంటలకు సాగునీరు అందిస్తాం.

సెప్టెంబర్ 2 న హైదరాబాద్ దగ్గర లోని కొంగరకలాన్ లో ప్రగతి నివేదన సభ జరపబోతున్నాం. గత నాలుగున్నర ఏళ్ళైలో జరిగిన అభివృద్ధిని ముఖ్యమంత్రి గారు వివరిస్తారు. అందరు బారీ ఎత్తున తరలిరావాలి. టిఆర్ఎస్ పార్టీ పాలిచ్చే బర్రే అయితే, పొడిచి, తన్నే దున్నపోతు లాంటిది కాంగ్రెస్ పార్టీ. ప్రజలు ఎన్నడూ కాంగ్రెస్ ను ఆదరించరు.