తెలంగాణలో మొన్నటి వరకు వర్షాలు లేక పంటలెండిపోయి ఇబ్బందులు పడ్డారు రైతులు. ఇప్పుడు పత్తి రైతులకు కొత్త ఆందోళన మొదలైంది. తెలంగాణలో వరి కాకుండా మిగతా ఆరుతడి పంటల్లో పత్తి పంటను ఎక్కువగా సాగు చేస్తున్నారు. గత ఏడాది పత్తి వద్దు వేయొద్దని ప్రభుత్వం చెప్పినా రైతులు ఊకోలేదు. మళ్లీ మళ్లీ పత్తి పంట సాగు చేస్తూనే ఉన్నారు. ఈసారి కూడా పెద్ద మొత్తంలో రైతులు పత్తి పంట సాగు చేస్తున్నారు.
తాజాగా మంచిర్యాల, నల్లగొండ జిల్లాలోని దేవరకొండలో ప్రాంతాల్లో కొత్త రకమైన పురుగు వ్యాప్తించి పత్తి పంటను నాశనం చేస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. గతంలో ఎన్నడూ లేని పురుగులు లేత పత్తి కాయలు తింటున్నట్లు గుర్తించారు. ఇప్పటి వరకు పాకుతూ వెళ్లే పురుగులు మాత్రమే పత్తి పంటను నాశనం చేసిన దాఖలాలున్నాయి. కానీ ఈ పురుగులు రెక్కలు కలిగి ఉండడంతో వేగంగా పొలంలో తిరుగుతూ పత్తి కాయలు ఖతం పట్టిస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
అయితే మహారాష్ట్రకు చెందిన ఒక సీడ్ కంపెనీ నుంచి తయారైన విత్తనాలకు ఈ రకమైన పురుగుల బెదర ఉన్నట్లు చెబుతున్నారు రైతులు. ఆ సీడ్ కంపెనీ విడుదల చేసిన బిటి 2 రకం విత్తనాలు నాటిన పొలాల్లోనే ఈ తరహా పురుగులు వస్తున్నట్లు చెబుతున్నారు.
నల్లగొండ జిల్లాలోని దేవరకొండ నియోజకవర్గంలోని కాల్వపెల్లి గ్రామంలో ఎస్.కె. బాబా అనే రైతు తన పొలంలో 6 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. ఆయన మహారాష్ట్ర కంపెనీ విడుదల చేసిన బిటి 2 రకం విత్తనాలు నాటారు. ఇంతకాలం వర్షాలు రాకపోవడంతో పత్తి పంట ఎదుగుదల లోపించింది. ఇక వర్షాలు వచ్చినయ్.. కాత, పూత బాగుంటదేమో అని రైతు అనుకుంటున్నవేళ ఈ కొత్త రెక్కల పురుగులు వచ్చి పొలంలో పిందె దశలో ఉన్న లేత కాయలు తింటున్నాయని బాబా ఆందోళన చెందుతున్నాడు. గ్రామంలో మిగతా వారి పొలంలో ఈ తరహా పురుగల బెడద లేదని చెప్పారు. కేవలం మహారాష్ట్ర సీడ్ కంపెనీ నుంచి తయారైన బిటి 2 రకం విత్తనాలు నాటినందుకే తమ పొలంలో ఈ కొత్త రకం పురుగులు దాడి చేస్తున్నట్లు చెప్పారు.
ఒకవేళ పురుగు మందు కొట్టినా ఈ పురుగులు రెక్కల సాయంతో బయటకు పోయి మందు ఘాడత తగ్గిన తర్వాత మళ్లీ వచ్చి చేరుతున్నాయని రైతు ఎస్ కే బాబా తెలిపారు. ఈ పురుగు దెబ్బకు తన తోటలో కాసిన కొద్దిగొప్ప కాయలు కూడా ఖతమైపోయినయ్ అని బాధపడుతున్నారాయన.
ఇప్పటి వరకు ఈ రకమైన పురుగులు పత్తి పంటను ఆశించిన దాఖలాలు లేవని ఫెస్టిసైడ్స్ వ్యాపారులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ పురుగు రావడమే కొత్త కాబట్టి ఏ మందు కొట్టాలో తెలియడంలేదంటున్నారు. ఈ కొత్త రకం పురుగులు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా పత్తి పంటలో చూడలేదని దేవరకొండకు చెందిన ఫెస్టిసైడ్ ఏజెన్సీ డీలర్ ఏశబోయిన సంతోష్ తెలిపారు.
మంచిర్యాలలో కూడా ఇదే రకమైన సమస్య నెలకొందని చెబుతున్నారు. మంచిర్యాల జిల్లాలోనూ ఈ రకం విత్తనాలు వేసిన చోటే ఈ ప్రమాదం ఉందని చెబుతున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు తక్షణమే దీనిపై శ్రద్ధ తీసుకుని నివారణ మార్గాలు చూపాలని రైతులు కోరుతున్నారు. కొత్త రకం పురుగల తాలూకు ఫొటోలు కింద ఉన్నాయి చూడండి.







