కేసీఆర్ కు ఉపఎన్నిక భయం పట్టుకుందా..?

టీఆర్ఎస్ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కొన్నేళ్ల క్రితం వరకు తెలంగాణలో ఎక్కడ ఉపఎన్నిక జరిగినా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉండేవారు. అయితే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రంలో పుంజుకున్న నేపథ్యంలో పరిస్థితులు పూర్తిస్థాయిలో మారిపోయాయి. తెలంగాణలో ఎన్నికలు జరగడానికి మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో ఉపఎన్నిక జరిగి టీఆర్ఎస్ ఓడిపోతే పార్టీ పరువు పోతుందని చెప్పవచ్చు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడుకు ఉపఎన్నిక రావచ్చని జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. ప్రస్తుతం మునుగోడు తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు ఈ మధ్య కాలంలో తెలంగాణలో జరిగిన ఉపఎన్నికల ఫలితాలు అధికార పార్టీకి అనుకూలంగా రాలేదు. హుజూరాబాద్, దుబ్బాక టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలు కాగా ఆ స్థానాలలో బీజేపీ గెలిచింది.

మునుగోడులో ఉప ఎన్నిక జ‌రిగి టీఆర్ఎస్ ఓడిపోతే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవడం కష్టమేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేరే అవకాశం ఉందని బీజేపీలో చేరితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికలో పోటీ చేయాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భావిస్తున్నారు. కాంగ్రెస్ పెద్దలు మాత్రం కోమటిరెడ్డిని పార్టీ మారకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా ఫలితాలు వెలువడే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలలో వెల్లడైంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వల్ల తెలంగాణ సీఎం కేసీఆర్ టెన్షన్ పడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్ వల్ల రెండుసార్లు టీఆర్ఎస్ అధికారంలోకి రాగా కేసీఆర్ కు వ్యతిరేకంగా పరిస్థితులు మారుతున్నాయి. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉపఎన్నికల ఫలితాలు మాత్రం కేసీఆర్ కు షాకిస్తున్నాయి.