తెలంగాణ ఆర్టీసి బస్సుకు తప్పిన పెను ప్రమాదం

తెలంగాణ ఆర్టీసి గరుడ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి 50 మంది ప్రయాణికులతో బస్సు గురువారం ఉదయం హైదరాబాద్ బయల్దేరింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం జూపూడి వద్దకు రాగానే బస్సు ఇంజన్ భాగం నుంచి పొగలు, మంటలు వచ్చాయి. దీనిని గమనించిన వెనుక కూర్చున్న ప్రయాణికులు డ్రైవర్ కు చెప్పారు. దీంతో అలర్ట్ అయిన డ్రైవర్ ప్రయాణికులందరిని కిందికి దిగమని చెప్పి బస్సు ఆపాడు.

ఇంతలోనే చుట్టు పక్కల వారు బస్సు పై నీల్లు చల్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పుడే అక్కడకు చేరుకున్న ఫైరింజన్ బస్సులోని మంటలను ఆర్పడంతో బస్సు వెనుక భాగం మాత్రమే కాలిపోయింది. ప్రయాణికులను మరొక బస్సులో హైదరాబాద్ పంపించారు. బస్సులో ఎలక్ట్రికల్ షార్ట్ సర్కూట్ కారణంగానే మంటలు వచ్చినట్టు గుర్తించారు. పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.