కేటిఆర్ కు మేడ్చల్ లో రేవంత్ రెడ్డి కొత్త సవాల్

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ సొంతంగా అధికారంలోకి రాకపోతే తాను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటానని కేటిఆర్ కాంగ్రెస్ నేతలకు పదే పదే సవాళ్లు విసురుతున్నారు. నిన్న కేటిఆర్ కొడంగల్ వెళ్లి కూడా ఇదే సవాల్ ను రేవంత్ రెడ్డికి విసిరారు. కూటమి అధికారంలోకి రాకపోతే రేవంత్ సన్యాసం పుచ్చుకుంటాడా అని సవాల్ చేశారు. దానికి మేడ్చల్ లో జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ కౌంటర్ ఇవ్వడంతో పాటు కొత్త సవాల్ విసిరారు. ఆ వివరాలు చదవండి.

రేపు మేడ్చల్ లో సోనియాగాంధీ సభ. కేసీఆర్ వైఫల్యాల ను ఎండగట్టి ప్రజలకు సోనియా భరోసా ఇస్తారు. సోనియా టూర్ తో కేసీఆర్, కేటీఆర్ కు వనుకుడు మొదలైంది. చేసింది ఏమిలేకపోవడం తో కేసీఆర్ ప్రాంతాలు, ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. కేసీఆర్ మాటల్లో నిరాశ నిస్పృహలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ ఓడిపోతే ఫామ్ హౌస్ లో పడుకుంటా అంటారు కేటీఆర్ ..అమెరికా పారిపోతా అంటున్నారు.. అధికారం లేకపోతే కేసీఆర్ ప్రజలకు సేవ చేయరా ..??

సోనియా సభ ప్రకంపనలు సృష్టించబోతున్నది. యాగాలకు చంద్రబాబు, వెంకయ్య నాయుడు లను పిలిపించుకున్న ది కేసీఆర్ కాదా ..? కేసీఆర్ కు అప్పుడు చంద్రబాబు ఆంధ్రా అని గుర్తురాలేదా? నాటకమాడుతున్నడా? ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చి కమిషన్ తీసుకున్నప్పుడు కేసీఆర్ కు గుర్తురాలేదా ..? తెలంగాణ టిడిపితో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే తప్పేంటి ..? రమణ, కోదండరాం, చాడ వెంకట్ రెడ్డి లు పక్కా తెలంగాణ బిడ్డలు. 

కేసీఆర్ డ్రైవర్ అయితే కేటీఆర్ క్లీనర్. నిజాలు మాట్లాడకూడదని కేసీఆర్ కుటుంబానికి శాపం ఉన్నట్లుంది. ఇంటికి నల్ల ఇవ్వకపోతే ఓటు అడగను అని చెప్పింది కేసీఆర్ కాదా? కేసీఆర్ అసెంబ్లీల చెప్పిన రెండు లక్షల డబల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎక్కడ పోయాయి ? జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో వంద సీట్లు రాకపోతే సన్యాసం తీసుకుంటా అని మాట తప్పింది కేటీఆర్ కాదా? 

పొద్దున లేస్తే పండే వరకు నిత్యం అబద్ధాలు చెప్పే నీచమైన చరిత్ర కేసీఆర్ ది. ఆంధ్రప్రదేశ్ నీళ్లను అడ్డుకునే ప్రశ్నే రాదు. ఒకవేళ చంద్రబాబు నీళ్లను రానీయకుండా అడ్డుకోవాలనుకున్నా సాధ్యం కాదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఎపి పైన ఉన్నది అన్న సంగతి గుర్తించుకోవాలి.  కేసీఆర్ కు ప్రాజెక్టులు కట్టడం చేతగాక చంద్రబాబు ను బూచిగా చూపెడుతున్నారు. చంద్ర బాబు పై నెపం పెట్టి ప్రజలను రెచ్చ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

కేసీఆర్, కేటీఆర్ లు అతితెలివి తేటలు ప్రదర్శిస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్ లు బిల్లా రంగా లాగ రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. రేపు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పారిపోతానని ప్రయత్నించినా కేటీఆర్ ను ఎక్కడికి పారిపోనీయమ్. దోచుకున్న డబ్బును కక్కిస్తాం. కేటీఆర్ ఆర్థిక నేరగాడు. కాబట్టి ఆయన దేశం విడిచి పారిపోకుండా రెడ్ అలర్ట్ ప్రకటించాలి. సిరిసిల్ల లలో దళితులను చిత్రహింసలు పెట్టినట్లు కొడంగల్ ప్రజలకు కూడా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారా? కేటిఆర్ కొడంగల్ ను దత్తత తీసుకుంటే అదే చేస్తారా? 

దళిత పిల్లలను కేటిఆర్ నీ కొడుకు తో పోల్చుతావా ? కేసీఆర్ మనవడైతే వాళ్లకు గొప్ప ప్రజలింకేంటి గొప్ప? ప్రజాకూటమి అధికారం లోకి రావడం ఖాయం. రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్ నుండి తెలంగాణకు విముక్తి కల్పించడం ఖాయం. 

రేవంత్ సవాల్ ఇదే :

అసెంబ్లీ ఎన్నికల్లో నాతో సవాల్ చేసేందుకు కేటీఆర్ ఓనర్ కాదు ..పనోడు. ఎమ్మెల్యే ఎన్నికలలో కాదు చేతనైతే ఎంపీ ఎన్నికల్లో పోటీపడదాం. గతంలో కేసీఆర్ పోటీచేసిన మహబూబ్ నగర్ ఏఎంపీ సీటులో పోటీకి రా. ఆ పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరం పోటీ పడదాం. ఎవరు గెలుస్తారో తేల్చుకుందాం. కేటిఆర్ నీకు చేతనైతే నా సవాల్ ను స్వీకరించాలి. 

కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక్కడే కాదు మరికొందరు ఎంపీలు కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. టిఆర్ఎస్ లో అవమానాలు భరించలేక వారు పారిపోయే పరిస్థితి ఉంది. వారు ఎవరో? ఎప్పుడొస్తారరో ఇప్పుడు చెప్పను. తినబోతూ రుచులెందుకు? ఎంపీలే కాదు ఎమ్మెల్సీ లు కూడా వస్తారు. నిజంగా కెసిఆర్ కు, కేటీఆర్ కు దమ్ముంటే వారిని ఆపుకోరి చూద్దాం.