అవిభక్త కవలలు వీణా-వాణిలంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. రెండు తలలు అతుక్కొని పుట్టడంతో వారిని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలన్నీ ఆవిరయ్యాయి. ప్రస్తుతం యూసుఫ్ గూడ స్టేట్ హోంలో ఉంటున్న వీణా వాణిలు నేటితో 16 వ ఏటకు అడుగు పెట్టారు. వీణా వాణిల బర్త్ డే వేడుకల వీడియో కింద ఉంది చూడండి.
వరంగల్ జిల్లాలోని దంతాలపల్లి మండలం భీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన మురళి, నాగలక్ష్మీ దంపతులకు వీణావాణిలు 2002 అక్టోబర్ 16 న సూర్యాపేట లో ని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో జన్మించారు. గుంటూరు జిల్లాకు చెందిన నాయుడమ్మ ఆధ్వర్యంలో వీణావాణిలకు చికిత్స కొనసాగినా ఆపరేషన్ చేయలేకపోయారు.
సింగపూర్, అమెరికా, స్విట్జర్లాండ్ నుంచి కూడా వైద్యులు వచ్చి వీరిని పరిశీలించారు. గత సంవత్సరం ఎయిమ్స్ వైద్యులు కూడా వీణా వాణికి చికిత్స చేస్తామని ప్రకటించారు. ఇంత వరకు మళ్లీ ఆ ఊసే లేదు.
వీణావాణిలు పుట్టనప్పటి నుంచి నీలోఫర్ లోనే ఉన్నారు. అక్కడే వారు చదువుకున్నారు. అన్ని వసతులను ప్రభుత్వం వారికి కల్పించింది. అయితే వీణావాణిలు ఎదుగుతున్న కొద్ది వారి శరీరంలో వచ్చే శారీరక మార్పుల దృష్ట్యా వారిని స్టేట్ హోం తరలించాలని అధికారులు నిర్ణయించారు. దీనికి వీణావాణిలు ఒప్పుకోలేదు.
నీలోఫర్ తో మాకు అనుబంధం ఉందని ఇందులోనే ఉంటామని చెప్పారు. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వారిని బలవంతంగానే యూసుఫ్ గూడలోని స్టేట్ హోంకి వారిని తరలించారు. వారు వెళ్లి పోతున్నప్పుడు వీణా వాణిలతో పాటు నీలోఫర్ లో వారికి సేవలందించిన వారు, సిబ్బంది కన్నీరుమున్నీరయ్యారు.
ప్రస్తుతం యూసుఫ్ గూడ స్టేట్ హోంలో ఉంటున్న వారు 8వ తరగతి చదువుతున్నారు. నేటితో వారు 16 ఏండ్లకు చేరుకున్నారు. తమకు పని చూపిస్తే పిల్లల వద్దే ఉంటామని వీణా వాణిల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరినా ఇంత వరకు ప్రభుత్వం స్పందించలేదు.
