కేసిఆర్ కు ఆపదలో అండగా ఉండి , ఇప్పుడు తిరుగుబాటు

అది 2018 ఏప్రిల్, మే సమయం. మంచి ఎండాకాలం. టిఆర్ఎస్ పార్టీ పుట్టిన తర్వాత ఆ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది ఆ సమయంలోనే. ఎంతగా అంటే టిఆర్ఎస్ పార్టీ ఉంటుందా? లేదా అన్నంతంగా. దానికి కారణం ఏమంటే? టిఆర్ఎస్ 2004లో కాంగ్రెస్, లెఫ్ట్ తో కలిసి టిఆర్ఎస్ కూటమిలో ఉన్నది. కూటమిలో ఉన్న టిఆర్ఎస్ తాను సాధించిన 26 సీట్లలో పది మంది అసమ్మతి రాగం వినిపిస్తూ అధికార కాంగ్రెస్ తో అంటకాగుతున్నారు. మిగిలిన 16 మంది తెలంగాణ కోసం 2008లో రాజీనామాలు చేశారు. నలుగురు ఎంపిలు కూడా రాజీనామాలు చేశారు. కానీ ఉప ఎన్నికలు వచ్చి ఫలితాలు టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా వచ్చాయి. 16 స్థానాల్లో పోటీ చేస్తే 7 స్థానాల్లో గెలిచి 9 సీట్లలో పార్టీ అభ్యర్థులు ఓడిపోయారు. నాలుగు ఎంపి సీట్లలో రెండు మాత్రమే గెలిచారు. మరో రెండులో ఓటమి తప్పలేదు.

బహుషా టిఆర్ఎస్ పార్టీ పెట్టినప్పటి నుంచి అదే పెద్ద సంక్షోభ కాలంగా టిఆర్ఎస్ చరిత్ర పేజీల్లో లిఖించబడ్డ పరిణామం. ఆ సంక్షోభం అప్పటితో ఆగలేదు. కంటిన్యూ అయింది. అప్పటి నుంచి 2009 ఎన్నికల వరకు కొనసాగింది. 2009 ఎన్నికల వేళ కేసిఆర్ కు తెలంగాణ భవన్ లో కాలు పెట్టలేని భయానక పరిస్థితి నెలకొంది. 2009లో టిడిపి, లెఫ్ట్ తో కలిసిన మహా కూటమిలో చేరింది టిఆర్ఎస్. కానీ 2009 ఎన్నికల వేళ కూడా టిఆర్ఎస్ సంక్షోభంలోనే ఉంది. మహా కూటమిలో సీట్లు బాగానే బేరం చేసి తీసుకున్నా టిఆర్ఎస్ గెలిచింది మాత్రం 10 సీట్లే. దాంతో టిఆర్ఎస్ భవిష్యత్తు పై అంతటా అనుమానాలు నెలకొన్నాయి. అనంతరం ఉమ్మడి రాష్ట్ర సిఎం వైఎస్ మరణం, తెలంగాణ ఉద్యమం పుంజుకోవడంతో టిఆర్ఎస్ తెలంగాణలో పుంజుకున్నది. తర్వాత వెనుదిరిగి చూడలేదు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో అధికారం చేజిక్కించుకున్నది. ఇదంతా చరిత్ర.

కేసిఆర్ తో రాములు నాయక్

2008 సంక్షోభ సమయంలో ఒక పరిణామం ఇప్పటికీ టిఆర్ఎస్ యుటి బ్యాచ్ (ఉద్యమ తెలంగాణ బ్యాచ్) కండ్ల ముందు మెదులుతూనే ఉంటుంది. అప్పుడు 2009 మే నెలలో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ఫలితాల అనంతరం కరుడుగట్టిన సమైక్యవాదిగా ఉన్న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ కు తెలంగాణలో మరింత పట్టు దొరికింది. టిఆర్ఎస్ మాట్లాడేందుకు వాయిస్ లేని పరిస్థితుల్లోకి నెట్టబడ్డది. ఫలితాలు రాగానే పార్టీ అధ్యక్ష పదవికి కేసిఆర్ రాజీనామా చేశారు. తెలంగాణ భవన్ కు కూడా రాకుండా ఇంటికే పరిమితమయ్యారు. ఆ సంక్షోభ సమయంలో తెలంగాణ భవన్ లో కేసిఆర్ లేకుండానే ఒక కీలక భేటీ జరిగింది. ఆ భేటీకి ఇప్పటి హోంమంంత్రి నాయిని నర్సింహ్మారెడ్డి అధ్యక్షత వహించారు. 

అప్పటికే అనేక ఊహాగానాలు, అనేక విమర్శలు, అనేక చర్చలు, అనేక వాదనలు జరుగుతూనే ఉన్నాయి. కేసిఆర్ నాయకత్వం ఫెయిల్ అయిందని, ఆయనను పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించి ప్రొఫెసర్ జయశంకర్ కు అప్పగించాలని ఒక చర్చ మొదలైంది. లేదు నాయిని నర్సింహ్మారెడ్డికి పార్టీ నాయకత్వం అప్పగించాలని మరో వాదన. ఇలా రకరకాల వాదనలు తెర మీదకు వచ్చాయి. వాటన్నిటినీ పటాపంచలు చేసేలా తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశంలో ఒక సామాన్య నాయకుడు ప్రసంగం చేశాడు. ఆయనెవరో కాదు ప్రస్తుత ఎమ్మెల్సీ రాములు నాయక్. ఆయనేమన్నారో తెలుసుకుందాం.

ప్రస్తుత టిఆర్ఎస్ ఎమ్మెల్సీ రాములు నాయక్

నాయిని నర్సింహ్మారెడ్డి నాయకత్వంలో ఆ సమావేశం జరిగింది. అందరి మొహాల్లో నైరాశ్యం ఆవహించింది. సభలో రాములు నాయక్ ను ప్రసంగించాలని నాయిని కోరారు. రాములు నాయక్ ప్రసంగం సభలో ఉన్నవారికి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. వెయ్యి ఏనుగుల బలాన్ని నింపింది. అంతగా రాములు నాయక్ ఏం మాట్లాడిండంటే… ఆయన చెప్పిన డైలాగులు ఇప్పటికీ పార్టీ కార్యకర్తలు చెప్పుకుంటూనే ఉంటారు. ఆపద కాలంలో రాములు నాయక్ పార్టీకి బూస్ట్ ఇచ్చిండని అందరూ అనుకున్నారు.

‘‘2008లో ఒక శాస్త్రవేత్త అంతరిక్షంలోకి రాకెట్ పంపిండు. కానీ ఆ రాకెట్ ప్రయోగం ఫెయిల్ అయింది. అలాగని ఆ శాస్త్రవేత్తను పక్కన పెట్టేద్దామా? వైఫల్యం వచ్చిందని రాకెట్ ప్రయోగాన్ని ఆపేద్దామా?? 2008 లో ఫెయిల్ అయితే 2009లో రాకెట్ ప్రయోగం సక్సెస్ అయితది. ఒక్క ప్రయోగంతో డీలా పడిపోతే శత్రువు ముందు నిలబడగలమా? 2009 రాకెట్ ప్రయోగానికి మన శాస్త్రవేత్త (కేసిఆర్) వెంట అందరం నడుద్దామా ? వద్దా?’’ ఇవే మాటలు రాములు నాయక్ సభలో మాట్లాడారు. హాల్ మొత్తం చప్పట్లతో మారుమోగింది. తర్వాత కేసిఆర్ రాజీనామాను ఆ సభలో ఏకగ్రీవంగా రిజెక్ట్ చేశారు. తర్వాత మళ్లీ టిఆర్ఎస్ పగ్గాలు అందుకున్నారు కేసిఆర్. కానీ సంక్షోభ ఛాయలు 2009 ఎన్నికల వరకు కొనసాగాయి.

అప్పుడు అంతగా మాట్లాడి ఆపద కాలంలో టిఆర్ఎస్ లో జోష్ నింపిన రాములు నాయక్ ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు. పార్టీపై తిరుగుబాటు జెండా ఎగురవేయబోతున్నారు. 2014 తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం రావడంతో రాములు నాయక్ కు ఎమ్మెల్సీగా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఖేడ్ లో పోటీ చేసేందుకు రాములు నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ నారాయణ్ ఖేడ్ లో సిట్టింగ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కే కేసిఆర్ టికెట్ ఖరారు చేశారు. 2014 ఎన్నికల్లో టిఆర్ఎస్ తరుపున నారాయణ్ ఖేడ్ లో కిష్టారెడ్డి గెలిచారు. కానీ ఆయన మధ్యలోనే మరణించడంతో ఆ సీటులో భూపాల్ రెడ్డిని బరిలోకి దింపి టిఆర్ఎస్ కాంగ్రెస్ ను ఓడించింది. కానీ భూపాల్ రెడ్డి మీద ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు చర్చ నడుస్తున్నది. 

నారాయణ్ ఖేడ్ తాజా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

అందుకే నారాయణ్ ఖేడ్ తనకు కేటాయించాలని రాములు నాయక్ పట్టుపడుతున్నారు. కానీ అధిష్టానం నో చెప్పడంతో పార్టీకి గుడ్ బై చెప్పి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగి సత్తా చాటాలన్న కసితో ఉన్నారు రాములు నాయక్. మరి రాములు నాయక్ ఇండిపెండెంట్ గానే పోటీ చేస్తారా? లేదంటే కాంగ్రెస్ కానీ ఇతర ఏదైనా పార్టీలో చేరి నారాయణ్ ఖేడ్ లో టికెట్ సంపాదిస్తారా అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న రాములు నాయక్ ఆ పార్టీని వీడాలన్న నిర్ణయం తీసుకోవడం చూస్తే యూటి బ్యాచ్ కు టిఆర్ఎస్ లో ఏరకమైన ఇబ్బందులున్నాయో తెలుస్తోందని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసిఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న కాలంలో రాములు నాయక్ కు జాతీయ స్థాయిలో ఒక కమిషన్ సభ్యుడిగా కూడా అవకాశం కల్పించారు.