తెలంగాణాలో ఇప్పుడు కాంగ్రెస్ బలహీనంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో రేవంత్ రెడ్డికి బాధ్యతలు ఇస్తే కాంగ్రెస్ కచ్చితంగా బలపడే అవకాశాలు ఉండవచ్చు అని ఆ పార్టీ కార్యకర్తలు కూడా అంటున్నారు. కాంగ్రెస్ కి దూరమైన కొన్ని సామాజికవర్గాలు తిరిగి వచ్చే అవకాశం ఉందన్నది కేసీఆర్ ఆందోళనగా కనపడుతుంది. రేవంత్ రెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తే ముందుగా ఇబ్బంది పడేది సిఎం కేసీఆర్. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ. రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే తెరాస పార్టీ మీద, కెసిఆర్ మీద ఆయన ఏమాత్రం దూకుడు తగ్గించడం లేదనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అందుకే ముందు జాగ్రత్తగా వైకాపాని తెలంగాణాలో తిరిగి ప్రోత్సహించాలని భావించినా.. వివిధ కారణాల వల్ల అది ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తుంది.
అయితే రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి గానూ సిఎం కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగారని సమాచారం. ఇప్పటికే తెరాస అనుకూల మీడియా మొత్తం కూడా రేవంత్ రెడ్డిని వ్యతిరేకించే నేతలతో ఇంటర్వ్యూలు కూడా నిర్వహించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక ఇప్పుడు ఓటుకి నోటు కేసు వ్యవహారాన్ని సిబిఐకి అప్పగించాలని సిఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. ఈ వ్యవహారం ఇప్పుడు ఏసీబీ పరిధిలో ఉంది. రేవంత్ రెడ్డిని అడ్డుకోవడానికి ఏసీబీ నుంచి సిబిఐకి పంపించి కేంద్రం ద్వారా రేవంత్ రెడ్డిని అడ్డుకునే ఆలోచనలో ఉన్నారని సమాచారం. అవసరం అయితే రేవంత్ రెడ్డిని సిబిఐ విచారించే విధంగా కూడా వ్యూహరచన చేస్తున్నట్టు సమాచారం.
అయితే ఈ కేసు విషయంలో రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చారు. కేసీఆర్ కి దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలని ఆయన సవాల్ కూడా చేస్తూ వచ్చారు. అవసరం అయితే రేవంత్ రెడ్డిని మానసికంగా దెబ్బ తీసే విధంగా మరికొన్ని వ్యూహాలు రెడీ చేసి… కేసులను కూడా ఆయన మీద పెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే విధంగా రాష్ట్ర, కేంద్ర పరిధిలో ఉండే వివిధ సంస్థల్ని వినియోగించుకుని రేవంత్ మీద పూర్తిస్థాయిలో ఒత్తిడి పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కేసుని తాము పూర్తి స్థాయిలో విచారించలేని స్థితిలో ఉన్నామని, కేంద్ర ప్రభుత్వ సంస్థల సహకారం తమకు కావాలని, సాంకేతిక పరమైన అంశాలు తమను ఇబ్బంది పెడుతున్నాయని ఏసీబీ కోర్ట్ లో చెప్పే అవకాశం ఉండవచ్చు అని భావిస్తున్నారు.