ముందస్తు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో టిఆర్ఎస్ లో అసమ్మతి కుంపట్లు బద్ధలవుతున్నాయి. ఏ జిల్లాలో చూసినా ఏమున్నది అన్నట్లు అన్ని జిల్లాల్లో టిఆర్ఎస్ లో అసమ్మతి రాగం ఆలపించేవారి సంఖ్య పెరిగిపోతున్నది.
నిర్మల్ తాజా మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి నిర్మల్ పట్టణంలో గట్టి షాక్ తగిలింది. నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ అప్పల గణేష్ తో పాటు 15 మంది కౌన్సిలర్లు టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినట్లు తొలుత సమాచారం అందింది. కానీ ఇప్పుడు ఆ కార్పొరేటర్ల సంఖ్య భారీగా పెరిగింది.

నిర్మల్ మున్సిపల్ ఛైర్మన్ అప్పల గణేష్ తో పాటు 21 మంది కౌన్సిలర్లు, ఒక కోఆప్షన్ మెంబర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అప్పల అనురాధ ఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ వ్యవహారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం రేపింది. నిర్మల్ నియోజకవర్గానికి గుండెకాయలాంటి నిర్మల్ పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి మీద తిరుగుబాటు రావడంతో టిఆర్ఎస్ వర్గాల్లో ఆందోళన మొదలైంది.
రాజీనామాలు చేసిన తర్వాత మున్సిపల్ ఛైర్మన్ అప్పల గణేష్ మీడియాతో మాట్లాడారు. నిర్మల్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ ఇళ్ల నిర్మాణం లో జిల్లా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. తమ నియోజకవర్గంలో టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేనే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలను ఎదగనీయకుండా అడ్డుకుంటున్నాడని విమర్శించారు.
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీద టిఆర్ఎస్అ ధిష్టానానికి పలుమార్లు వివరించినా స్పందనలేదన్నారు. తమ ఆవేదన పట్టించుకోలేదు కాబట్టే టిఆర్ఎస్ పార్టీలో తమకు విలువ లేదు కాబట్టే ఆ పార్టీకి రాజీనామాలు చేసినట్లు ప్రకటించారు. అతి త్వరలోనే భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు గణేష్. టిఆర్ఎస్ బిజెపికి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నది కాబట్టే తాము టిఆర్ఎస్ కు గుడ్ బై చెప్పినట్లు వెల్లడించారు.
ఇదిలా ఉంటే స్థానిక కాంగ్రెస్ నేత మహేశ్వర్ రెడ్డి రాజీనామాలు చేసిన కొద్దిసేపటికే అప్పల గణేష్ ఇంటికి వెళ్లి వారితో సమావేశమయ్యారు. కర్టసీగానే కలిసినట్లు చెబుతున్నారు. అయితే పార్టీలోకి మహేశ్వర్ రెడ్డి ఆహ్వానించారు. అయితే ఈనెల 20వ తేదీన భైంసాలో రాహుల్ గాంధీ సభ ఫిక్స్ అయింది. రాహుల్ సభ కంటే ముందే వీరంతా కాంగ్రెస్ కండువాలు కప్పుకునే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

నిర్మల్ లో చిరకాల ప్రత్యర్థులుగా ముద్ర పడ్డారు యుటి బ్యాచ్ టిఆర్ఎస్ నేత శ్రీహరి రావు, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. వీరిద్దరూ ఒకప్పుడు గురు శిష్యులే. కానీ రాజకీయాల్లో ఉన్న వైరం కారణంగా ప్రత్యర్థులయ్యారు. 2014 ఎన్నికల్లో 1600 స్వల్ప ఓట్ల తేడాతో శ్రీహరి రావు ఐకె రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. అయితే 2019లో అయినా సీటు వస్తుందేమో అని శ్రీహరి రావు ఆశించారు.
కానీ 2014 ఎన్నికలు ముగిసిన కొద్ది రోజుల్లోనే ఐకె రెడ్డి టిఆర్ఎస్ గూటికి చేరిపోయారు. దాంతో మంత్రి అయ్యారు. బిటి బ్యాచ్ గా ఆయన టిఆర్ఎస్ లో చేరడంతో యూటి బ్యాచ్ గా ఉన్న శ్రీహరి రావు పరపతి తగ్గుతూ వచ్చింది. ఈసారి టికెట్ అవకాశాలు లేకపోయాయి శ్రీహరికి. అభ్యర్థిని ప్రకటించేసరికే ఇక చేసేది లేక శ్రీహరి రావు ఐకె రెడ్డికి మద్దతు ప్రకటించారు. ఇంతలోనే మున్సిపాలిటీలో ముసలం పుట్టడంతో టిఆర్ఎస్ వర్గాల్లో కలవరం మొదలైంది.
మరోవైపు అసమ్మతుల పట్ల టిఆర్ఎస్ అధినాయకత్వం చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నది. అసమ్మతి రాజేసిన వారిని ఒక దశ వరకు బుజ్జగిస్తున్నది. అయినా కట్టు తప్పితే వేటు వేసేందుకు కూడా సంకోచించడంలేదు.

ఇలాగే నల్లగొండ జిల్లాలోని మునుగోడు లో అసమ్మతి రాగం ఆలపించిన స్థానిక నేత వేనేపల్లి వెంకటేశ్వరరావు మీద వేటు వేసింది టిఆర్ఎస్ అధిష్టానం. వెంకటేశ్వరరావు మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మీద తిరుగుబాటు చేశారు. కూసుకుంట్ల అవినీతి అక్రమాలు అంటూ ప్రతిపక్ష నేతల కంటే ఎక్కువగా విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో వేనేపల్లి ని పార్టీ నుంచి బహిష్కరించారు.
