టిఆర్ఎస్ కీలక నేత, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ ఎంపి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆస్తులపై కేంద్ర ఆదాయపన్ను శాఖ సోదాలు నిర్వహిస్తున్నది. మంగళవారం ఉదయం నుంచీ సోదాలు సాగుతున్నాయి.
ఏక కాలంలో ఖమ్మంలో, హైదరాబాద్ లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లో 6చోట్ల, ఖమ్మంలో 12 చోట్ల ఏక కాలంలో సోదాలు జరుపుతున్నారు ఐటి అధికారులు.
ఖమ్మం నగరంలోని శ్రీ శ్రీ సర్కిల్ సమీపంలోని ఎంపి నివాసంలో ఉదయం 9 గంటల నుంచే సోదాలు మొదలు పెట్టారు. ఎంపి ఇంట్లోకి ఎవరినీ రానీవ్వకుండా రెండు గేట్లు మూసేసి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు.
మరోవైపు బంజారాహిల్స్ లోని రాఘవ ఇన్ ఫ్రా కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి. రాఘవ కన్స్ స్ట్రక్షన్స్ అనే పెద్ద సంస్థ పొంగులేటిదే. ఈ సంస్థ తెలంగాణలోని భారీ ప్రాజెక్టులు చేపడుతున్నది.
ఆదాయ పన్ను చెల్లింపుల విషయంలో ఐటి అధికారుల సోదాలు చేస్తుండడంతో ఖమ్మం టిఆర్ఎస్ వర్గాల్లో కలవరం రేగుతున్నది. ఈ సోదాలపై ఎంపి పొంగులేటి స్పందించారు.
ఇవి రొటీన్ సోదాలే అని తేల్చి చెప్పారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి నుంచి గెలుపొందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తర్వాత బంగారు తెలంగాణ సాధించేందుకు టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఖమ్మంలో గెలిచిన ముగ్గురు వైసిపి ఎమ్మెల్యేలు కూడా బంగారు తెలంగాణ సాధిస్తామంటూ టిఆర్ఎస్ లో చేరిపోయారు.
ప్రస్తుతం ఖమ్మం టిఆర్ఎస్ పార్టీలో అధినేత కేసిఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితా పట్ల పొంగులేటి గుర్రుగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. ఆయన అనుచరులు అభ్యర్థుల జాబితా ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆందోళనలు కొనసాగిస్తూనే ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పారిశ్రామికవేత్తగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిలిచారు. తెలంగాణ అంతటా సగం కాంట్రాక్టులు పొంగులేటి చేతిలోనే ఉన్నాయని టిఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సోదాలు టిఆర్ఎస్ కు ఇబ్బందికరమైన పరిస్థితిని కల్పించాయన్న ప్రచారం జరుగుతున్నది.
