ప్రేమించి పెళ్లి చేసుకొని వదిలేసి వెళ్లడంతో న్యాయం కోసం భర్త ఇంటి ముందు భార్య ఆందోళనకు దిగింది. యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావిలో ఈ ఘటన జరిగింది. గుండ్లబావి గ్రామానికి చెందిన చిదుగుళ్ల శిల్ప, ఆవుల శివాజీ ఇద్దరిది ఒకే ఊరు కావడంతో వారి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో వారు పెళ్లికి ఒప్పుకోలేదు.

పెద్దలు పెళ్లికి ఒప్పుకోకపోవడంతో ఈ ఏడాది జూలై 24న హైదరాబాద్ లోని ఆర్య సమాజ్ లో వివాహం చేసుకొని వనస్థలిపురంలో కాపురం పెట్టారు. మూడు నెలల పాటు వారి కాపురం సజావుగానే సాగింది.ఈ నెల 20న శిల్పను వాళ్లమ్మకు ఫోన్ చేయమని శివాజీ చెప్పడంతో తన తల్లికి ఫోన్ చేసింది. ఆమె కామినేని ఆసుపత్రిలో ఉన్నాం అని చెప్పటంతో కలిసేందుకు వెళ్లింది. ఆమె తిరిగి ఇంటికి వస్తుండగా ఐ మిస్ యూ అని మెసేజ్ పెట్టడంతో శిల్ప కంగారు పడి ఫోన్ చేయగా శివాజీ వచ్చి కలిశాడు.

బస్టాండ్ వద్దే ఉండమని చెప్పి వెళ్లాడు. నీవంటే ఇష్టం లేదు, నేను వెళ్లిపోతున్నా, మా వాళ్లు నీతో కలిసి ఉండనివ్వరని శిల్పకు శివాజీ మెసేజ్ పెట్టాడు. తర్వాత ఫోన్ చేయగా శివాజీ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. దీంతో శిల్ప ఆందోళనకు గురై కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించగా పెద్ద మనుషుల సమక్షంలో తేల్చుకోవాలని పోలీసులు సూచించారు. ఇరు వర్గాల పెద్దలు ఈ నెల 25న శివాజీని తీసుకొస్తామని చెప్పి మాట తప్పారు. దీంతో శిల్ప గ్రామస్థులు, మహిళా సంఘాలు, బంధువులతో కలిసి గుండ్లబావిలోని శివాజీ ఇంటి ముందు బైఠాయించింది. శిల్ప తనకు న్యాయం చేయాలని ఆందోళన చేస్తున్న వీడియోలు కింద ఉన్నాయి చూడండి.
శివాజీ మంచోడని అతని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులే అతనిని దాచి పెట్టారని ఆరోపించింది. తన భర్తతో కలిపి తనకు న్యాయం చేయాలని శిల్ప వేడుకుంది. శివాజీని తీసుకొచ్చి శిల్పకు న్యాయం చేసేంత వరకు నిరసనను కొనసాగిస్తామని గ్రామస్థులు తెలిపారు. కట్నం ఆశతోనే శివాజీ కుటుంబ సభ్యులు ఈ నాటకమాడుతున్నారని పలువురు ఆరోపించారు.
