బాలయ్యకు ఎన్నికల్ కమీషన్ షాక్, రోడ్ షోకు బ్రేక్

తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న టీడీపీ ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ కు ఎన్నికల సంఘం(ఈసీ) షాకిచ్చింది. ఈ రోజు జరగాల్సిన రోడ్ షో లో పాల్గొనేందుకు ఫర్మిషన్ ని నిరాకరించింది. దీంతో తెలుగుదేశం శ్రేణులు దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

ఈ నెల ఒకటవ తేదీ నుంచి బాలకృష్ణ కంటిన్యూగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. తన ఎన్టీఆర్ బయోపిక్ కు గ్యాప్ ఇచ్చి మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆయన ప్రసంగాలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. కేసీఆర్ ను టార్గెట్ చేస్తూ ఆయన స్పీచ్ లు ఇస్తున్నారు. అయితే ఊహించని విధంగా ఇప్పుడు ఈసీ నుంచి ట్విస్ట్ పడింది.

ఈసీ రూల్స్ ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహించే వ్యక్తులు ఆ సమాచారాన్ని ఈసీకి 48 గంటలు ముందుగా ఇవ్వాలి. అయితే టీడీపీ శ్రేణులు ఈ విషయాన్ని మర్చిపోవటం దెబ్బ కొట్టింది. దీంతో బాలయ్యకు షాక్ ఇస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. కాగా, ఎన్నికల కమిషన్ నిర్ణయం నేపథ్యంలో బాలయ్య ప్రచారానికి దూరం కానున్నారు.

గత నాలుగు రోజుల నుంచి కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, మలక్‌పేట్, ఫతేనగర్‌లలో ఎన్నికల ప్రచారం చేసిన బాలయ్య, తెలంగాణను మళ్లీ దొరల పాలనకు టీఆర్ఎస్ తీసుకెళ్తోందని ఆరోపించారు. నాలుగున్నరేళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పులు తెలంగాణగా మార్చిన ఘనత టీఆర్‌ఎస్‌కే దక్కుతుందని బాలకృష్ణ ఎద్దేవా చేశారు.