కెసిఆర్ మాయమాటలు, వైఫల్యాలు, అవినీతే కాంగ్రెస్ టార్గెట్

ఎన్నికల ప్రచారాన్ని ఒక ఉద్యమం లాగా కళాకారుల, మేధావుల, కార్యకర్తల స హకారంతో నడిపేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతూన్నది. తెలంగాణ ఆశయం నెరవేరలదేని, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఒక కుటుంబం హైజాక్ చేసుకుపోయిందని, దానిని విడిపించుకుని ప్రజలకు అందించేందుకు చేస్తున్న ఉద్యమమే ఎన్నికల ప్రచారమనే తీరులో రూపకల్పన జరుగుతూ ఉంది.

తెలంగాణ ప్రజలను గాలికొదిలేసి సెంటిమెంటును రెచ్చగొట్టి పబ్బం గడుపుకుంటున్న ముఖ్యమంత్రి కెసియార్, కుమారుడు కెటియార్ ల యారోగెన్స్ మీద ప్రచారాన్ని ఎక్కుపెడుతున్నారు. గదేంది, గిదేంది, వాడెవడు, వీడెవడు, సన్నాసులు, బఫూన్  వంటి భాష కెసియార్ యారొగెన్స్ (అహంకారం)అని కాంగ్రెస్ భావిస్తూ ఉంది. ఈ మధ్య రాహుల్ గాంధీని మీద కూడా కెసి యార్ అసభ్యంగా మాట్లాడటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతున్నది.

కాంగ్రెస్ ప్రచారం ఈ అంశాలన్నంటిని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. నినాదాలు తెలంగాణ మళి ఉద్యమ స్ఫూర్తితో ఉంటాయని, ఈ ఎన్నికల ప్రచారం తెలంగాణ అత్మగౌరవం చుట్టూ తిరుగుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులొకరు తెలిపారు. ఉత్తుత్తి హామీలు కాకుండా, నిజమయిన హామీలు ఇవ్వాలని, ఇచ్చిన హామలన్నింటిని అమలు చేసే కార్యక్రమం అధికారం లోకి వచ్చిన మరుసటి క్షణం నుంచి మొదలవుతుందని కాంగ్రెస్ నాయకులు హామీ ఇవ్వబోతున్నారు. ముఖ్యమంత్రి కెసియార్ హామీలన్నింటికి అబద్దాల రంగుపూసి, పూర్తిగాని కమిషన్ల భగీరధ, కాకతీయల కింద తొక్కి పెట్టిన విషయాన్ని కాంగ్రెస్ ప్రజలు ముందు పెడుతుందని ఆయన చెప్పారు.
ఈ వివాలన్నింటిని రెండు మూడు రోజులలో పిసిసి వెల్లడిస్తుందని అన్నారు.

అమలుచేసు హామీలే ఉంటాయి కాబట్టి మేనిఫెస్టోకి ప్రజా మేనిఫెస్టో అని పిలుస్తున్నారు. నిజంగా లబ్ది చేకూర్చే రైతుల‌కు రుణ‌మాఫీ, యువ‌త‌కు నిజంగా ఉద్యోగాలు.. బీపీఎల్ కుటుంబాల‌కు నిజంగా ఉచిత సిలిండ‌ర్‌లు, ఎస్సీ, ఎస్టీల‌కు నిజంగా స‌న్నబియ్యం ఇలా మేనిఫెస్టోలో నిజాలను చేర్చుతూ ఉందని తెలిసింది. కాంగ్రెస్ వర్కింగ్ ప్రెశిడెంట్ భ‌ట్టి విక్రమార్క నేతృత్వంలో ఎన్నిక‌ల‌ ప్రచార‌ క‌మీటీ భేటీ అయి ప్రచారానికి మాస్టర్ ప్లాన్ రూపొందించింది. ప్రజల అవ‌స‌రాలు, ఆకాంక్షలు, వాటిని నెరవేర్చడంతో కేసీఆర్ మాయమాటలు, ద్రో హాలను, వైఫల్యాలను కాంగ్రెస్ అస్త్రంగా చేసుకుంటున్నది. ఒక వేళ మహాకూటమి కామన్ మినిమమ్ అజండా వస్తే  కాంగ్రెస్ ప్రతిపాదించిన అంశాలన్నీ ఉంటాయి.

ఇదే ధీమ్ ని సోనియా గాంధీ , రాహుల్ గాంధీల రోడ్ షోలను కూడా ఏర్పాటు చేయబోతున్నారు. తెలంగాణ క‌ళాకారులు, క‌వుల‌ను, సామాజిక ఉద్యమకారుల‌ను పార్టీలోకి ఆహ్వానించా, కెసిఆర్ చేతిలో తెలంగాణ ఎలా వంచనకు గురయిందో చెప్పించాలనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ‘సామాజిక , ప్రజాస్వామిక తెలంగాణ’ అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తారు.  కాంగ్రెస్ సీనియర్ నేత  భట్టి విక్రమార్క ప్రజాగాయకుడు గద్దర్ ను కలుసుకోవడం కూడా మాస్టర్ ప్లాన్ అమలుచేయడంలో సహకారం అందించాలని కోరేందుకే నని తెలిసింది.

మహాకూటమి తయారువుతూ ఉండటంతో కాంగ్రెస్ కార్యకర్తల్లో ఉత్సహం రెట్టింపయింది. చాలామంది లో కాంగ్రెస్ కొద్ది కష్టపడితే పవర్ లోకి వస్తారన్న ధీమా కనిపిస్తూ ఉంది. దీనివల్లే పార్టీ టికెట్ల్లకు డిమాండ్ పెరిగిందని, పోటీ ఎక్కువగా ఉందని ఒక సీనియర్ నాయకుడు చెప్పారు.
తెలంగాణ రాష్ట్ర సమితి నాయకత్వంలో అసహనం కనిపిస్తూ ఉందని, దీనికి సంకేతమే రేవంత్ ఇళ్ల మీద ఐటి దాడులని కాంగ్రెస్ భావిస్తూ ఉంది.