ఇదేం తిరకాసు… కేటిఆర్ ను నిలదీసిన కాంగ్రెస్ శ్రవణ్

ఎన్నికల విధులకు ఆంధ్రాపోలీస్ ను అనుమతించడం లేదని తెలంగాణా ఎన్నికల కమీషనర్ రజత్ కుమార్ చెప్పడం రాజ్యాంగ విరుద్దమని శ్రవణ్ దాసోజుఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్ కెసిఆర్ ఆదేశాల్ని అమలు చేస్తుందా, లేక భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుందా చెప్పాలని .. సూటిగా ప్రశ్నించారు దాసోజు.

పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్ ఉందని విభజన చట్టం హామీ స్పష్టం చేస్తున్నాతుంగలో తొక్కి టీఆర్ఎస్ పార్టీకి భజన చేయడం సరికాదని టీపిసిసి కాంపైన్ కమిటి కన్వీనర్ శ్రవణ్ దాసోజు విమర్శించారు. మంగళవారం ఆయన ఒక విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో అనేక అంశాలను లేవనెత్తారు. 

రాజ్యాంగాన్ని సంరక్షించాల్సిన ఎన్నికల కమీషనర్ గులాబీ పార్టీకి తొత్తుగా మారి ఆంధ్రా, తెలంగాణా అంటూ విభజన రాజకీయాలకు పాల్పడతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రా పోలీస్ పై టీఆర్ఎస్ ఫిర్యాదు చేస్తే అవకతవకలకు పాల్పడ్డ పోలీసులపై విచారణ చేపట్టి సస్పెండ్ చేయొచ్చని, కాని చేయకుండా మొత్తం పోలీస్ వ్వవస్ధనే కించపరిచే విధంగా ఎన్నికల విధుల నుంచి తప్పించడం సరికాదన్నారు.

ప్రజల్లో టీడీపీ కాంగ్రెస్ ప్రజకూటమికి రోజురోజుకు వస్తున్న ఆదరణతో కంటిమీద కునుకు లేకుండా పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తున్న కేకేటీఆర్ సీమాంధ్ర ప్రజల ఓట్ల కోసం కాకాపట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఓవైపు కేసీఆర్ ఆంధ్రా ,తెలంగాణా అంటు విభజన రాజకీయాలు మాట్లాడితే.. వారి ఓట్ల కోసం కొడుకు కాళ్లు పట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు.

ఇటీవల హమారా హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ తీరు, గతంలో మాట్లాడిన కేసీఆర్ తీరు గమనిస్తే నొసటితో వెక్కిరిస్తూ, నోటితో నవ్వుతున్నట్లుందని ఈ ఇద్దరివ్యవహరాన్ని ప్రజలంతా గమనిస్తున్నారని త్వరలోనే కర్రుగాల్చి వాత పెడుతారని హెచ్చరించారు.

ఎన్నికల కోసం విభజన రాజకీయాలకు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లోలబ్ది పొందేందుకు ఏది పడితే అది మాట్లాడడం కల్వకుంట్ల కుటుంబానికి అలవాటేనని, ముందస్తు ఎన్నికల నేపధ్యంలో కొంగర కలాన్ సభలో ఆంధ్రా రాక్షసులంటూ, అమరావతికి అమ్ముడు పోదామా అంటూ విషం చిమ్మిన విషయం అప్పుడే ప్రజలంతా ఎలా మరిచిపోతారని శ్రవణ్ అన్నారు.

మరో వైపు నిజామాబాద్ సభలో ఇక్కడ పుట్టినోళ్లంతా ఇక్కడోళ్లే, మిగితా వారంతా ఆంధ్రా వాళ్లని విభజన రాజకీయాలు చేసారని, అక్కడి వారు, ఇక్కడి వారు అంటూ విడదీసే అధికారం ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణాలో నివసించే వారంతా ఇక్కడి వారేనని క్లెయిమ్ చేసుకోవాలని కేసిఆర్ అనడం చూస్తుంటే భారత రాజ్యాంగం కాకుండా కొత్తగా కల్వకుంట్లరాజ్యాంగం అమలులో ఉందా అని ప్రశ్నించారు. తెలంగాణాలో నివసించాలంటే అదేదో ప్రత్యేక దేశమన్నట్లు, కల్వకుంట్ల వారి అనుమతి ఉంటేనే ఉండాలన్నట్లు వారి దయాదాక్షిణ్యాలతోనే ఉంటున్నట్లు వ్యవహరించడం సరికాదన్నారు. 

తెలంగాణాలో ఆంధ్రాప్రాంతం వారిపట్ల ఏమన్నా వివక్షఉందా అని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని, మరో వైపు కేసీఆర్ ఇక్కడుండే ఆంధ్రావారంతా క్లెయిమ్ చేసుకోవాలంటున్నారని ఇది వివక్ష కాక మరేంటో స్పష్టం చేయాలన్నారు. తార్నాక ప్రాంతంలో లిటిల్ ఇంగ్లండ్ లో ఉన్న ఆంగ్లేయుల వారసులు , మల్కాజ్ గిరి ప్రాంతంలో ఉన్నతమిళ ప్రజలు, మళయాళీలు, కన్నడిగులు, బేగంబజార్ లోరాజస్థానీలు, గుజరాతీలు ఇలా భిన్న రాష్ట్రాలనుంచి వచ్చిన వారున్నారున్నారని, అలాగే వందల ఏళ్ల క్రితం సౌదినుంచి వచ్చి బార్కస్ లో నివసిస్తున్న వారందరికి అండగా ఉండరా అని ప్రశ్నించారు.

మతానికి కులానికి ,ప్రాంతానికి, ఆస్తికి అంతస్తుకు అతీతంగా అండగా ఉండడం రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యమన్నారు. ప్రత్యేకంగా ఆంధ్రా ప్రజలకు అండగా ఉంటామనడం వారిని బెదిరించడమే అని శ్రవణ్ విమర్శించారు. ఒకవైపు తండ్రి కేసిఆర్ తిడుతూ ఉంటే మరోపక్క కొడుకు కేటిఆర్ బతిలాడుతూ ఉన్నారని విమర్శించారు. ఈ విషయంలో అయ్య కొడుకుల బాగోతాన్ని తెలంగాణ జనాలు గుర్తు పట్టాలని పిలుపునిచ్చారు దాసోజు శ్రవణ్.