రాహుల్గాంధీ ఇచ్చిన అవకాశంతో మళ్లీ తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న చంద్రబాబు నంద్యాల మోడల్ను ఫాలో అవుతూ చకచకా పావులు కదుపుతున్నారు. నంద్యాల ఉప ఎన్నికలో గెలిచేందుకు అనుసరించిన వ్యూహాన్ని బాబు క్యాంప్ ఇక్కడ పక్కాగా అమలు చేస్తోంది. ఇందుకోసం బాబు ఒరలో ఎప్పుడూ సిద్ధంగా ఉండే లాబీయిస్టులు, మీడియా మేనేజర్లు, పోల్ మేనేజ్మెంట్ నిపుణులు, రాజకీయ పండితుల బృందం హైదరాబాద్లో మకాం వేసింది. టీడీపీ పోటీ చేస్తున్న 12 నియోజవర్గాల్లో గెలిచే అవకాశం ఉన్న ఆరు స్థానాలపై గట్టి దృష్టి పెట్టి అక్కడ తన మనుషులతో అండర్ గ్రౌండ్ వర్క్ చేయిస్తున్నారు. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న స్థానాల్లో ఒక వ్యూహం, బలంగా ఉన్న స్థానాల్లో మరో వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

నంద్యాల ఉప ఎన్నికలో గెలిచేందుకు చంద్రబాబు భారీ ఎత్తున డబ్బు ఖర్చుచేయడం, పంపిణీకి సరికొత్త మార్గాలను ఎంచుకున్నారు. ఇంటింటికీ వెళ్లి వారికి అవసరమైన పనుల్ని అప్పటికప్పుడే చేసేయడం, మాట వినకపోతే ప్రభుత్వ పథకాలు రాకుండా నిలిపివేస్తామని బెదిరించడం ద్వారా లొంగదీసుకున్నారు. వార్డులు, గ్రామాల వారీగా ఇన్ఛార్జిలను నియమించి వారికి డబ్బు పంపిణీ చేయడంలో పోటీ పెట్టారు. ఎవరు ఎక్కువ డబ్బు ఖర్చు పెడుతున్నారో ఏరోజుకు ఆరోజు సమీక్ష చేస్తూ వారి లోపాలను టెలీకాన్ఫరెన్స్ ద్వారా చెప్పి సరిచేసేవారు.
ఇప్పుడు తెలంగాణలోనూ ఇదే తరహా పంపిణీ కోసం తన మనుషుల్ని రంగంలోకి దింపారు. ఆంధ్రా ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ధూళిపాళ నరేంద్ర, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీలు రాజేంద్రప్రసాద్, పయ్యావుల కేశవ్ వంటి వారు ఇప్పుడు అదే పనిలో తెలంగాణలో నిమగ్నమైపోయారు. ఎమ్మెల్యేకు ఒక నియోజకవర్గాన్ని కేటాయించి అతనికి సహాయంగా 20 నుంచి 30 మంది నాయకులను కేటాయించారు. వారు వార్డుల్లో స్థానిక నాయకులతో కలిసి తిరిగి తమకు అనుకూలంగా ఉండే వారిని నయానో, భయానో ప్రలోభపెట్టాల్సివుంటుంది. పైనుంచి మంత్రులు దీన్ని పర్యవేక్షిస్తున్నారు.
మీడియా మేనేజ్మెంట్ను టీడీపీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్కు అప్పగించారు. అన్ని పత్రికలు, టీవీల్లో ప్రజా ఫ్రంట్ ప్రకటనలే ఉండేలా ప్లాన్ రూపొందించి అమలు చేస్తున్నారు. ఏపీలో తనకు పూర్తిగా అనుకూలంగా ఉండే మీడియా మొత్తం ఇప్పుడు హైదరాబాద్లో ప్రజాఫ్రంట్ కోసం పనిచేస్తోంది. ఇందుకోసం విజయవాడ నుంచి పెద్దఎత్తున ఆయా ఛానళ్లు తమ రిపోర్టర్లను హైదరాబాద్కు పంపాయి. టీఆర్ఎస్కు చెందిన బలమైన నాయకులను సైలెంట్ చేసేందుకు, తమకు సహకరించేందుకు బాబు లాబీయిస్టులు చాపకింద నీరులా డబ్బు ఖర్చు పెడుతున్నారు. సోషల్ మీడియా ప్రచారం కూడా బాబు పరివారం పెద్దఎత్తున చేపట్టింది.
ఎన్నికల భారమంతా రాహుల్గాంధీ చంద్రబాబుకు అప్పగించడంతో ఆయన తన మార్కు రాజకీయం చేస్తూ కేసీఆర్కు టెన్షన్ పుట్టించాడు. పది రోజుల్లోనే మీడియా పూర్తిగా కాంగ్రెస్కు అనుకూలంగా మారిపోయింది. మౌత్ పబ్లిసిటీ కూడా ప్రజాఫ్రంట్కు అనుకూలంగా పెరిగింది. దీంతోనే కేసీఆర్ కాంగ్రెస్ను వదిలి చంద్రబాబును టార్గెట్ చేశారు. అయినా చంద్రబాబు తనదైన శైలిలో నంద్యాల మోడల్ వ్యూహాన్ని అమలు చేస్తూ వెళ్లిపోతున్నారు. ఈ షో హిట్ అవుతుందో లేక ఫట్మంటుందో వేచిచూడాల్సిందే.
