దేశంలో తొలి కరోనా మృతి.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్న ప్రధాని..

దేశంలో తొలి కరోనా మృతి నమోదైంది. జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాల హైదరాబాద్‌లో మృతిచెందిన కర్ణాట వాసి మహ్మద్‌ హుస్సేన్‌ సిద్దిఖీ(76) కొవిడ్‌-19 పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు ధ్రువీకరించారు. ప్రస్తుతం సిద్దిఖీతో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి, అతడు ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించాడు వంటి వాటిపై దృష్టి సారింది అనుమానం ఉన్న వారిని ఐసోలేషన్‌కు తరలించే చర్యలు చేపట్టారు.

అలాగే హైదరాబాద్‌లో రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో సిద్ధిఖీ చికిత్స పొందిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. సిద్దిఖీ చికిత్స పొందిన ఆస్పత్రుల్లో వైద్యం చేసిన డాక్టర్లు, సిబ్బంది, సిద్ధిఖీ ఇక్కడ ఎవరెవరిని కలిశారు తదితర అంశాలను సేకరిస్తోంది. ఈ వివరాలను కర్నాటక ప్రభుత్వానికి కూడా త్వరలో తెలియజేయనుంది. మొత్తంగా దేశంలో ఇప్పటి వరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 74కు చేరగా వారిలో 16 మంది ఇటాలియన్లు, ఒకరు భారత మూలాలున్న కెనడా వైద్యురాలు. ఇప్పటి వరకు ఒక మృతి కేసు నమోదైంది.

ఇక కరోనా వైరస్ పాజిటివ్ వ్యక్తులు 74 మందితో సన్నిహితంగా మెలిగిన వారిని, వారి చుట్టుపక్కల వ్యక్తులు ఇలా మొత్తం 1500 మందిని, దేశవ్యాప్తంగా అనుమానం ఉన్న 30 వేల మందిని పరిశీలనలో ఉంచినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం అవసరైన వైద్య సదుపాయాలతో సిద్ధంగా ఉందని, రాష్ట్రాలు కూడా చర్యలు చేపట్టాయని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపింది.

అదే విధంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే చాలు అంటూ ప్రధాని మోదీ కూడా దేశ ప్రజలకు సూచించారు. కరోనాపై ట్వీట్టర్ వేదికగా స్పందించిన మోదీ అనవసరపు ప్రయాణాలు మానుకోవాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. మంత్రివర్గ సహచరులు కూడా విదేశీ ప్రయాణాలకు కొద్ది కాలం దూరంగా ఉంటారని తెలిపారు.