కరోనా చిక్కుల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే

టీఆర్ఎస్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఇప్పుడు కరోనా వివాదంలో చిక్కుకున్నారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలను తీసుకుంటోంది, అలాగే అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాంటిది ఓ ఎమ్మెల్యే అయ్యుండి కూడా..
అమెరికాలో పర్యటించి గురువారం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న కోనప్ప, ఆయన సతీమణి క్వారంటైన్ వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లిపోవడం ఇప్పుడు వివాదాస్పదమైంది.

పైగా ఎమ్మెల్యే అంతటితో ఆగకుండా జన సమూహంలో తిరుగుతూ పలు కార్యక్రమాల్లో పాల్గొనడం చర్చగా మారింది. భాద్యతగా ఉండాల్సిన నేతలే ఇలా చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పైగా ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సైతం వారిని అలా బయటకు ఎలా అనుమతించారని నిలదీస్తున్నారు. మరి కరోనాపై విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తూ, ముందస్తు జాగ్రత్తలు చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వం దీనిపై ఏం సమాధానం చెప్తుందో..!?