IPL-2020: ఈ సీజన్లో అత్యల్ప స్కోరు చేసిన కోల్‌కతా నైట్‌రైడర్స్… సరదాగా కొట్టేసి గెలిచేసిన బెంగళూరు

Royal Challengers Bangalore defeat Kolkata Knight Riders by 8 wickets

అబుదాబి : ఐపీఎల్ 2020 సీజన్‌లో తొలిసారి మ్యాచ్‌ పూర్తిగా ఏకపక్షంగా ముగిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో అబుదాబి వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ 8 వికెట్ల తేడాతో అలవోక విజయాన్ని అందుకుంది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌కతా టీమ్.. బెంగళూరు బౌలర్లు చాహల్ (2/15), వాషింగ్టన్ సుందర్ (1/14), నవదీప్ సైనీ (1/23) దెబ్బకి 8 వికెట్లు కోల్పోయి 84 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (30: 34 బంతుల్లో 3×4, 1×6) టాప్ స్కోరర్‌‌కాగా.. ఐదుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. అనంతరం ఛేదనలో దేవ్‌దత్ పడిక్కల్ (25: 17 బంతుల్లో 3×4), అరోన్ ఫించ్ (16: 21 బంతుల్లో 2×4), కెప్టెన్ విరాట్ కోహ్లీ (18 నాటౌట్: 17 బంతుల్లో 2×4), గుర్‌కీరత్ సింగ్ మన్ (21 నాటౌట్: 26 బంతుల్లో 4×4) నిలకడగా ఆడటంతో 13.3 ఓవర్లలోనే 85/2తో బెంగళూరు విజయాన్ని అందుకుంది. తాజా సీజన్‌లో 10వ మ్యాచ్ ఆడిన బెంగళూరుకి ఇది ఏడో గెలుపుకాగా.. 14 పాయింట్లతో ఆ జట్టు నెం.2 స్థానానికి ఎగబాకింది. కోల్‌కతా ఐదో ఓటమితో నాలుగో స్థానానికి పడిపోయింది.

Royal Challengers Bangalore defeat Kolkata Knight Riders by 8 wickets
Royal Challengers Bangalore defeat Kolkata Knight Riders by 8 wickets

మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ.. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే రాహుల్ త్రిపాఠి (1), నితీశ్ రాణా (0) వికెట్లని పడగొట్టిన మహ్మద్ సిరాజ్.. ఆ జట్టుని ఒత్తిడిలోకి నెట్టేశాడు. ఆ తర్వాత ఓవర్‌లో శుభమన్ గిల్ (1)ని నవదీప్ సైనీ బోల్తా కొట్టించేయడంతో ఆ టీమ్ 3/3తో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన టామ్ బాంటన్ (10: 8 బంతుల్లో 1×4, 1×6) భారీ షాట్లు ఆడే సిరాజ్‌కి వికెట్ సమర్పించుకోగా.. దినేశ్ కార్తీక్ (4: 14 బంతుల్లో).. చాహల్ బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడబోయే మూల్యం చెల్లించుకున్నాడు. ఒక వైపు వికెట్లు పడుతున్నా.. మొండిగా క్రీజులో నిలిచిన ఇయాన్ మోర్గాన్ ఆ టీమ్‌కి గౌరవమైన స్కోరు అందించేలా కనిపించాడు. కానీ అతని పోరాటం ఫలించలేదు. ఆఖర్లో పాట్ కమిన్స్ (4) తేలిపోయినా.. కుల్దీప్ యాదవ్ (12: 19 బంతుల్లో 1×4), లూకీ ఫర్గూసన్ (19: 16 బంతుల్లో 1×4) కాసేపు క్రీజులో నిలవడంతో కోల్‌కతా 84 పరుగులైనా చేయగలిగింది.

బెంగళూరు బౌలర్లలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి.. మూడు వికెట్ల పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ 2, నవదీప్ సైని, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ సాధించారు. ఈ మ్యాచ్‌లో నాలుగు మెయిడిన్ ఓవర్లు వచ్చాయి. సిరాజ్ 2, క్రిస్ మోరిస్, వాషింగ్టన్ సుందర్ తలో మెయిడిన్ ఓవర్ వేశారు. ఐపీఎల్ చరిత్రిలో నాలుగు మెయిడిన్ ఓవర్లు నమోదవడం ఇదే తొలిసారి. ఇక ఈ మ్యాచ్‌లో హైదరాబాదీ ప్లేయర్ మహమ్మద్ సిరాజ్ సంచలనం సృష్టించాడు. 4 ఓవర్లలో కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు మెయిడిన్ ఓవర్లు కూడా ఉన్నాయి. ఐపీఎల్ చరిత్రలో రెండు వరుస ఔవర్లను మెయిడిన్ చేసిన మొట్ట మొదటి బౌలర్‌గా రికార్డు సాధించాడు సిరాజ్. అంతేకాదు ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.