IPL 2020 : గాయపడ్డ మరో స్టార్‌ ప్లేయర్‌.. ఆరెంజ్‌ ఆర్మీకి మరో షాక్‌!?

దుబాయ్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) సీజన్‌ 13లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఏదీ కలసి రావడం లేదు. వరుసగా రెండు మ్యాచ్‌లో ఓడటం, కీలక ఆటగాళ్ల గాయాల బరిన పడటం ఆరెంజ్‌ ఆర్మీకి కలవరానికి గురిచేస్తోంది. ఇప్పటికే సన్‌రైజర్స్‌ కీలక ఆటగాడు మిచెల్‌ మార్ష్‌ గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరంగా కాగా.. మరో కీలక ఆటగాడు గాయం బారిన పడ్డాడు. సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ వెన్నెముక, స్టార్‌ ప్లేయర్‌ మనీశ్‌ పాండే గాయపడటం అటు టీం మేనేజ్‌మెంట్‌కు, ఇటు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.


శనివారం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న మనీశ్ పాండే గాయపడ్డాడు. బౌండరీ లైన్‌కి సమీపంలో బంతిని అందుకున్న మనీశ్ పాండే వేగంగా త్రో విసరగా.. ఆ క్రమంలోనే అతడి తొడ కండరాలకి గాయమైంది. దీంతో మ్యాచ్‌ మధ్యలోనే మైదానం వీడిన మనీశ్ పాండే మళ్లీ ఫీల్డింగ్‌కి రాలేదు. అయితే అతడి గాయంపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాలేదు. అంతేకాకుండా మనీశ్‌ గాయంపై సన్‌రైజర్స్‌ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

 

ఒకవేళ ఈ మ్యాచ్‌కి మనీశ్ పాండే దూరమైతే ఇప్పటికే పేలవ బ్యాటింగ్‌ కలిగిన సన్‌రైజర్స్‌.. మరింత బలహీనంకానుంది. మ్యాచ్ రోజుకి మనీశ్ పాండే ఫిట్‌నెస్ సాధించలేకపోతే అతని స్థానంలో విజయ్ శంకర్ మ్యాచ్‌లో ఆడే అవకాశం ఉంటుంది. శనివారం కేకేఆర్‌తో జరగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఘోర ఓటమి చవిచూసింది. ఇది సన్‌రైజర్స్‌కు వరుసగా రెండో ఓటమి. ఇక సన్‌రైజర్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌తో అబుదాబి వేదికగా మూడో మ్యాచ్‌ ఆడనుంది.