ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు జనసేనాని పవన్ కల్యాణ్ పంపిన ఒకే ఒక్క ఆడియో మెసేజ్ పెను సంచలనంగా మారింది. పిఠాపురం వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘జై కొట్టు’ యువజన విభాగం సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు అటు పొలిటికల్ సర్కిల్స్లో, ఇటు సోషల్ మీడియాలో ఒక రేంజ్లో హల్చల్ చేస్తున్నాయి. అసలు “ఎవడికీ జై కొట్టొద్దని పవన్ ఎందుకు అన్నట్టు..?” అనే ముచ్చట ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.
కేవలం విపక్షాలకే కాదు, అంతర్గతంగా కూటమిలోని తమ్ముళ్లకు కూడా పవన్ కల్యాణ్ ఈ కామెంట్స్ ద్వారా ఒక గట్టి హింట్ ఇచ్చారనే టాక్ నడుస్తోంది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా యువతను కేవలం తమ సభలకు జనాలుగా వాడుకోవడానికి, తమ నాయకులకు “జిందాబాద్” లు కొట్టించుకోవడానికే చూస్తుంది. కానీ పవన్ కల్యాణ్ ఈ పాత పంథాకు పూర్తిగా భిన్నంగా స్కెచ్ వేశారు. “ఇన్నాళ్లు నాయకులు, పార్టీల కోసం జిందాబాద్ కొట్టాం.. ఇకపై యువత భవిత, మార్పు, తీర్పు కోసం జై కొట్టాలి” అని ఆయన స్పష్టం చేశారు.
అంటే యువత కేవలం స్వార్థపరులైన లీడర్ల కోసం జెండాలు మోసే కూలీలుగా మిగిలిపోకుండా.. ఒకరి కింద చేతులు చాచకుండా, తమ సొంత భవిష్యత్తును మార్చుకునే పవర్ఫుల్ లీడర్లుగా ఎదగాలన్నదే పవన్ కల్యాణ్ ప్రధాన ఉద్దేశం. ఈ కామెంట్స్ ద్వారా యువతలో ఉన్న ‘నాయకుల భజన’ సంస్కృతిని పక్కనబెట్టి, వారిని చైతన్యవంతమైన పౌరులుగా మార్చేందుకు ఆయన ఈ మైండ్ గేమ్ ప్లే చేసినట్లు కనిపిస్తోంది.
రాజకీయ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈ వ్యాఖ్యల వెనుక ఒక పెద్ద పొలిటికల్ మాస్టర్ ప్లాన్ దాగి ఉంది. ప్రస్తుతం టీడీపీ – జనసేన కూటమి ప్రభుత్వంలో కొన్ని చోట్ల స్థానిక సీట్ల విషయంలో, మున్సిపాలిటీల విషయంలో తమ్ముళ్లకు, జనసైనికులకు మధ్య ఇంటర్నల్ కోల్డ్ వార్ నడుస్తోంది. ఇలాంటి తరుణంలో “దేనికోసం చేతులు చాచొద్దు.. దేశం కోసం పనిచేసే చేతులు కావాలి” అని పవన్ అనడం వెనుక.. జనసేన క్యాడర్ ఎవరి ముందూ మోకరిల్లాల్సిన అవసరం లేదని, తమ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ముందుకు సాగాలని తన సొంత సైన్యానికి దిశానిర్దేశం చేసినట్లు అర్థమవుతోంది. మరి పవన్ కల్యాణ్ తీసుకొచ్చిన ఈ ‘జై కొట్టు’ నినాదం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ఎలాంటి పొలిటికల్ మైలేజ్ తెచ్చిపెడుతుందో చూడాలి.