ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పైస్థాయిలో సిఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటి సిఎం పవన్ కళ్యాణ్ ‘బ్రదర్స్’ లాగా అన్నీ తామే చూసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం సీన్ వేరేలా ఉందనే టాక్ ఎప్పటినుంచో నడుస్తోంది. తాజాగా ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ దీనికి అద్దం పడుతోంది. పైస్థాయిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు లభిస్తున్న గౌరవం, ప్రాధాన్యత గ్రౌండ్ లెవెల్లో టీడీపీ తమ్ముళ్లు ఇవ్వడం లేదనేది ఈ ఘటనతో మరోసారి బట్టబయలైందని పొలిటికల్ సర్కిల్స్లో గట్టి చర్చ నడుస్తోంది.
అసలు మ్యాటర్ ఏంటంటే.. దర్శిలో జనసేన శ్రేణులు తమ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు. అయితే, అక్కడ ఉన్న లోకల్ టీడీపీ నేతలు దీనిని తీవ్రంగా వ్యతిరేకించడంతో రగడ మొదలైంది. “కూటమి ప్రభుత్వం ఉంటే మాత్రం మీ ఇష్టమొచ్చినట్టు ఫ్లెక్సీలు పెడతారా?” అంటూ తమ్ముళ్లు అడ్డుపడటంతో జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య పెద్ద ఎత్తున వాగ్యుద్ధం నడిచింది. ఇరువర్గాల మధ్య మాట ముదిరి తీవ్ర ఉద్రిక్తతకు దారితీయడంతో సీన్లోకి మున్సిపల్ అధికారులు ఎంట్రీ ఇచ్చారు.
ట్విస్ట్ ఏంటంటే.. వివాదాన్ని సర్దిచెప్పాల్సిన మున్సిపల్ అధికారులు, ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలనే అక్కడి నుండి తొలగించేశారు. దాంతో జనసైనికులకు ఎక్కడో కాలింది. తమ సొంత ప్రభుత్వంలోనే తమ అధినేత, ఉప ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం వెనుక స్థానిక టీడీపీ నేతల హస్తం ఉందంటూ జనసేన నాయకులు అధికారులతో తీవ్రంగా వాగ్వాదానికి దిగారు. పైస్థాయిలో పవన్ కళ్యాణ్ కూటమి ధర్మం అంటూ పదే పదే చెప్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం టీడీపీ నేతలు జనసేనను మరియు పవన్ను కనీస స్థాయిలో కూడా గౌరవించడం లేదనే దానికి దర్శి ఘటనే పక్కా ఉదాహరణ అంటూ జనసేన క్యాడర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఈ ఫ్లెక్సీల వివాదం కూటమిలో ఎలాంటి చిచ్చు పెడుతుందో చూడాలి మరి.