తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో తానే నంబర్ వన్, తన మాటే శాసనం అనుకునే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఒక చిన్న కేబినెట్ ప్రక్షాళన లేదా వివాదాస్పద మంత్రిని తొలగించడం ఎంత ‘హిమాలయ’ పర్వతమంత కష్టమో తాజాగా కొండా సురేఖ ఎపిసోడ్తో తేలిపోయింది. రాష్ట్రంలో నిత్యం సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించడానికి సాక్షాత్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఢిల్లీకి ఫ్లైట్ ఎక్కి, ఏఐసీసీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి రావడం ఇప్పుడు గాంధీ భవన్ వర్గాల్లోనే పెద్ద జోక్ అయిపోయింది. అసలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డికి ప్రభుత్వంపైనా, పార్టీపైనా ఆ రేంజ్ ‘పట్టు’ ఉందా? లేక అంతా కలరింగేనా? అనే కోణంలో పొలిటికల్ సర్కిల్స్లో గట్టి వెటకారం నడుస్తోంది.
నిజానికి కొండా సురేఖపై వేటు వేయాలని రేవంత్ ఎంత గట్టిగా డిసైడ్ అయినా.. తెరవెనుక నడిచిన క్యాబినెట్ లాబీయింగ్ చూసి సీఎం గారికే మైండ్ బ్లాక్ అయిందట. సురేఖను కాపాడటానికి, ఆమెకు అనుకూలంగా కేబినెట్లోని ముగ్గురు సీనియర్ మంత్రులు ఢిల్లీ స్థాయిలో విపరీతమైన లాబీయింగ్ నడిపినట్లు ప్రచారం సాగుతోంది. “ఆమెను ముట్టుకుంటే బీసీ మహిళా కార్డు బయటకు వస్తుంది, పార్టీకి నష్టం జరుగుతుంది” అంటూ ఈ ముగ్గురు మంత్రులు అధిష్ఠానం వద్ద రేవంత్ వ్యూహాలకు గండి కొట్టే ప్రయత్నం చేశారు. ఒక సొంత కేబినెట్ మంత్రిని కంట్రోల్ చేయలేక, పైగా తోటి మంత్రులే తనకు ఎదురు తిరిగి లాబీయింగ్ చేస్తుంటే.. వారిని లైన్లో పెట్టలేక రేవంత్ ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకోవాల్సి రావడం ఆయన లీడర్షిప్కే ఒక పెద్ద ప్రశ్నార్థకంగా మారింది.
ఎలాగోలా ముగ్గురు మంత్రుల లాబీయింగ్ను తట్టుకుని, ఢిల్లీ పెద్దలను ఒప్పించి చివరకు సురేఖను తప్పించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు అనుకోండి.. కానీ ఇందుకోసం ఆయన పడ్డ కష్టం, పడిన పాట్లు చూస్తే మాత్రం జాలికే జాలి వేస్తోంది. ఒకప్పుడు వైఎస్సార్ లాంటి లీడర్లు ఒక చిన్న ఫోన్ కాల్తో మంత్రుల రాజీనామాలు తీసుకునేవారు. కానీ నేటి ‘ఫైర్ బ్రాండ్’ రేవంత్ రెడ్డి మాత్రం సొంత పార్టీలోనే తన పట్టును నిరూపించుకోవడానికి ఇంతలా ఆయాసపడాల్సి వస్తోంది. సురేఖ చాప్టర్ ముగిసినా, తోటి మంత్రులే తన సీటు కిందకు నీళ్లు తెచ్చేలా లాబీయింగ్ చేస్తున్నారనే పచ్చి నిజం రేవంత్కు మింగుడుపడటం లేదట. మరి ఈ ‘ముగ్గురు మంత్రుల’ గుట్టు తేల్చి రేవంత్ తన పట్టు నిలుపుకుంటారో.. లేక ఢిల్లీ చుట్టూ ఇలాగే టూర్లు వేస్తూ కాలం వెళ్లదీస్తారో చూడాలి.