‘నేను రాను.. మీరే చూసుకోండి’, తన మంత్రులకు పవన్ చెప్పేసారా..?

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సమయం ముంచుకొస్తున్న తరుణంలో జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ మంత్రులు, కీలక నేతలకు ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. తన అనారోగ్యం, సుదీర్ఘ రికవరీ ప్రక్రియ నేపథ్యంలో ఈ ఎన్నికల బాధ్యతలను పూర్తిగా పార్టీ సీనియర్ నాయకత్వానికే అప్పగిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. “నేను ప్రస్తుతానికి క్షేత్రస్థాయికి రాలేను.. ఎన్నికల వ్యవహారాలన్నీ మీరే దగ్గరుండి చూసుకోండి” అని పవన్ కళ్యాణ్ పార్టీ మంత్రులకు తేల్చి చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.

ఇటీవల భుజానికి జరిగిన సర్జరీ, వైద్యుల నిరంతర పర్యవేక్షణ కారణంగా పవన్ కళ్యాణ్ బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. చికిత్స కోసం ఆయన కేరళ వెళ్ళడంతో.. ఇప్పట్లో పవన్ అందుబాటులోకి వచ్చే అవకాశం కనపడటం లేదు. ఈ పరిస్థితుల్లో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల ప్రచారాల్లో ఆయన నేరుగా పాల్గొనడం సాధ్యం కాదని తేలిపోయింది. అందుకే, పార్టీ శ్రేణుల్లో ఎలాంటి అయోమయం లేకుండా ఉండేందుకు.. నాదెండ్ల మనోహర్ మరియు మంత్రి కందుల దుర్గేష్ వంటి కీలక నేతలకు ఎన్నికల పూర్తి బాధ్యతలను అప్పగించారు.

కూటమిలో సీట్ల సర్దుబాటు చర్చల నుండి అభ్యర్థుల ఎంపిక వరకు అన్నింటినీ ఈ సెకండ్ లైన్ లీడర్‌షిప్ పర్యవేక్షించనుంది. తాను భౌతికంగా అందుబాటులో లేనప్పటికీ, తెరవెనుక నుండి డిజిటల్ మాధ్యమాల ద్వారా మరియు సమీక్షల ద్వారా పార్టీ వ్యూహాన్ని పవన్ కళ్యాణ్ పర్యవేక్షిస్తూనే ఉంటారని జనసేన వర్గాలు అంటున్నాయి. జనసైనికులు, వీరమహిళల ఆత్మగౌరవానికి భంగం కలగకుండా, కూటమి ధర్మాన్ని పాటిస్తూనే పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో గెలుపే లక్ష్యంగా అడుగులు వేయాలని ఆయన మంత్రులకు ఆదేశించారు. అధినేత ఇచ్చిన ఈ భరోసాతో మంత్రి కందుల దుర్గేష్ నేతృత్వంలోని 14 మంది సభ్యుల కమిటీ క్షేత్రస్థాయిలో కసరత్తును మరింత ముమ్మరం చేసింది.