ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏ పథకం వచ్చినా, ఏ హైటెక్ టెక్నాలజీ వచ్చినా దానికి ఫస్ట్ మొగుడు మన మంగళగిరి మాత్రమేనా అని పక్క జిల్లాల జనాలు నోరెళ్లబెడుతున్నారు. రక్తం బొట్టు తీయకుండా, సూదితో గుచ్చకుండా.. కేవలం మీ అందమైన ముఖాన్ని ‘స్కాన్’ చేసి నిమిషంలో అరవై రోగాలు కనిపెట్టేసే సరికొత్త ఏఐ మిషన్ను మన విద్యా, వైద్య రంగాలు తెచ్చి ఎక్కడ పెట్టాయో తెలుసా..? ఇంకెక్కడ.. మంత్రి లోకేష్ సార్ ప్రాతినిధ్యం వహించే మళ్లీ అదే మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రిలో.
రాష్ట్రంలో మిగతా 25 జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ దవాఖానాలు, అక్కడి రోగుల ముఖాలు అధికారులకు అంతగా నచ్చలేదో ఏమో కానీ.. ఏ ప్రయోగం చేయాలన్నా మంగళగిరికే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం చూస్తుంటే, మిగతా ఊర్ల వాళ్లంతా ఏపీ మ్యాప్లోనే లేనట్లు ఫీలవుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే.. బ్లడ్ టెస్టుల కోసం క్యూలైన్లలో నిలబడి, శాంపిల్స్ ఇచ్చి, ఆ రిపోర్టుల కోసం రెండు రోజులు నరకం చూడాలి. కానీ ఈ సరికొత్త టెక్నాలజీతో ఆ తిప్పలన్నీ తప్పుతాయట.
రోగి అలా వచ్చి మిషన్ ముందు నిలబడి ‘చీజ్’ అని ఒక చిన్న స్మైల్ ఇస్తే చాలు.. కేవలం 60 సెకన్లలో బాడీ ప్రొఫైల్ మొత్తం కంప్యూటర్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతుంది. ఈ అధునాతన డిజిటల్ వైద్యం మంగళగిరి ప్రజలకు అందుబాటులోకి రావడం సంతోషమే కానీ.. ఉత్తరాంధ్ర, రాయలసీమ లోని పల్లెటూరి జనాలు మాత్రం, “మా ముఖాలు చూసి రోగాలు కనిపెట్టే మిషన్లు మాకెప్పుడు వస్తాయి సార్?” అని వెటకారంగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ హైటెక్ ముఖం చూసే మిషన్ మంగళగిరి హెల్త్ సెంటర్లోనే ట్రయల్ రన్ జరుపుకుంటోంది.
అక్కడ ప్రయోగం గనుక బంఫర్ సక్సెస్ అయితే.. అప్పుడు తీరిగ్గా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మిగతా ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా ఈ మిషన్లను పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉందట. అంటే అప్పటివరకు మిగతా జిల్లాల పేద రోగులంతా పాత పద్ధతిలోనే సూదులతో పొడిపించుకుంటూ, బ్లడ్ రిపోర్టుల కోసం ల్యాబ్ల చుట్టూ తిరగాల్సిందేనన్నమాట. ఏది ఏమైనా, రాజధాని ప్రాంతం అనే ట్యాగ్ లైన్తో అన్నీ మంగళగిరికే గుమ్మరిస్తుంటే.. పక్కన ఉన్న జిల్లాల ప్రజలు మాత్రం అసూయతో కుళ్లుకుంటూ, తలా ఒక ముఖం పెట్టుకుని చూస్తున్నారు.