వాణిశ్రీ కోట్ల విలువైన స్థలం కబ్జా.. చొరవ చూపించిన సీఎం!

వాణిశ్రీ ఒక ప్రముఖ భారతీయ నటి. 1960, 1970 లలో పేరుపొందిన తెలుగు సినిమా నటి. ఈమె అసలు పేరు రత్నకుమారి. వాణిశ్రీ తెలుగులోనే కాక తమిళం, మలయాళం, కన్నడ భాషలలో నటించింది. మరుపురాని కథ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. సుఖ దుఃఖాలు సినిమాలో చెల్లెలి పాత్ర ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక వరుస అవకాశాలతో రెండు దశాబ్దాల పాటు అగ్ర హీరోయిన్ గా రాణించింది. తరువాత వివాహం చేసుకొని సినిమాలకు దూరంగా ఉండి కుటుంబ బాధ్యతలు చూసుకుంది. తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సహాయ పాత్రలలో రాణించడం జరిగింది.

ఇక అసలు విషయానికి వస్తే వాణిశ్రీ కి చెందిన 20 కోట్ల విలువైన స్థలం కబ్జాకు గురవడం జరిగింది. దీనిపై అధికారులను ఆశ్రయించగా.. సీఎం స్టాలిన్ ప్రత్యేక చొరవ తీసుకొని.. ల్యాండ్ ను వాణిశ్రీ అప్పగించారు. 11 ఏళ్ల క్రితం స్థలం కబ్జాకు గురవ్వగా.. స్టాలిన్ ప్రభుత్వం చొరవ వల్ల తన స్థలం తనకు దక్కింది.

కబ్జాదారులు కొందరు నకిలీ పత్రాలు సృష్టించి వాణిశ్రీ కి చెందిన స్థలాన్ని తమ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకుని.. ఇతరులను విక్రయించే ప్రయత్నం చేయగా విషయం తెలుసుకున్న వాణిశ్రీ అధికారులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో భూ కబ్జాదారులకు సంబంధించి 2021 సెప్టెంబర్ లో తమిళనాడు శాసనసభ నూతన చట్టాన్ని ఆమోదించింది. దీని ప్రకారం నకిలీ పత్రాలు, వ్యక్తుల ద్వారా అక్రమంగా వేరే వారికి చెందిన భూమి రిజిస్ట్రేషన్ చేయిస్తే.. దాన్ని రద్దు చేసే అధికారం ఆ శాఖకు కల్పిస్తున్నట్లు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసింది.

ఈ చట్టం ప్రకారం వాణిశ్రీ కి సంబంధించిన కోట్ల విలువైన స్థలాన్ని.. ఆ కబ్జాదారుల నుండి విడిపించి, భూమికి సంబంధించిన పత్రాలను స్వయంగా సీఎం స్టాలిన్ గారు వాణిశ్రీ కి అందించారు.