ఇవి ఒకప్పటి రాజకీయపు రోజులు కావు. జనం కళ్ళ ముందు కనబడకపోతే తాము స్వయంగా ఓటేసి గెలిపించిన లీడర్లను కూడ మర్చిపోతుంటారు. ఇక రాజకీయ ప్రత్యర్థులు అయితే సందు దొరికితే చాలు అల్లుకుపోవడం కాదు దున్ని అవతల పారేస్తున్నారు. కొన్ని రోజులు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎవరైనా నియోజకవర్గంలో లేకపోతే అక్కడి అధికార పార్టీ లీడర్లు అంతా తామై ఎమ్మెల్యే పాత్ర పోషించేస్తున్నారట. అధికారులు సైతం ఎమ్మెల్యేను పక్కనబెట్టి అధికార పార్టీ నేతలను ఫాలో అయిపోతున్నారట. మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు నియోజకవర్గం టెక్కలిలో సరిగ్గా ఇదే సీన్ కనబడుతోంది. ఎమ్మెల్యే ఆయనే అయినా ఆయన ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోతున్నాయట.

YSRCP leader gives big shock to Atchannaidu
అచ్చెన్నాయుడు ఈమధ్య ఈఎస్ఐ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొని ఆరెస్టయ్యారు. సుమారు 78 రోజుల వరకు ఆయన కస్టడీ, హాస్పిటల్ అంటూ నియోజకవర్గానికి దూరమయ్యారు. ఈ గ్యాప్లో దొరికిందే తడవని వైసీపీ లీడర్ చెలరేగిపోయారట. ఆయనే నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ దువ్వాడ శ్రీనివాస్. శ్రీనివాస్ చాలాకాలంగా ఎమ్మెల్యే అవ్వాలని గట్టిగా ట్రై చేస్తున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీ చేసిన ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో చేరి 2014 ఎన్నికల్లో టికెట్ పొంది మళ్లీ బరిలోకి దిగారు. అయినా ఆయనకు అదృష్టం కలిసిరాక ఓడిపోయారు.

YSRCP leader gives big shock to Atchannaidu
ఇక 2019 ఎన్నికల్లో కూడ టికెట్ కోసం ప్రయత్నించగా వైసీపీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. తిలక్ అనే కొత్త వ్యక్తిని బరిలో నిలిపింది. అయినా టీడీపీ తరపున అచ్చెన్నాయుడు గెలిచారు. టికెట్ కోసం ఆశపడిన దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ పదవి ఇచ్చారు. దీంతో మొదటి నుండి దూకుడుగానే వ్యవహరిస్తున్న శ్రీనివాస్ అచ్చెన్నాయుడు మూడు నెలలు లేకపోయేసరికి ఆ అవకాశాన్ని వాడుకుని ప్రభుత్వం తరపున జరగాల్సిన పనులన్నీ తన చేతుల మీదుగానే జరిపించేశారట. అసలు ఆయనే ఎమ్మెల్యే అన్నట్టు సీన్ నడిపారట. ఈ మూడు నెలలు ఆయన జనంలోకి బాగానే చొచ్చుకుపోయారని టాక్. కస్టడీ నుండి తిరిగొచ్చిన అచ్చెన్న జరిగిన ఈ వ్యవహారం మొత్తం తెలుసుకుని ఖంగుతిన్నారట.
