YSRCP : రఘురామకృష్ణరాజుపై వైసీపీ గెలిచినట్టేనా.?

YSRCP : వైఎస్సరా్ కాంగ్రెస్ పార్టీకి పక్కలో బల్లెంలా తయారయ్యారు ఆ పార్టీకి చెందిన ఎంపీ రఘురామకృష్ణరాజు. ఎక్కడ తేడా కొట్టిందోగానీ, వైసీపీ నుంచి నర్సాపురం ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజు, అనూహ్యంగా రివర్స్ గేర్ వేసి.. అధికార వైసీపీ మీదనే దుమ్మెత్తిపోయడం మొదలు పెట్టారు.

రఘురామ, వైసీపీ మీదా.. వైసీపీ ప్రభుత్వం మీదా.. ముఖ్యమంత్రిపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో, ఆయన మీద ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది, ఆయన్ని అరెస్టు చేసింది కూడా. అదంతా గతం. వైసీపీకి ఇంతలా నష్టం చేస్తోన్న రఘురామపై ఆ పార్టీ ఇంతవరకు సస్పెన్షన్ వేటు వేయలేకపోయింది. అనర్హత వేటు కూడా వేయించలేకపోతోంది.

లోక్‌సభ స్పీకర్‌కి పలు దఫాలు రఘురామ అనర్హతపై ఫిర్యాదులు చేసిన వైఎస్సార్సీపీ, ఎట్టకేలకు ఈ క్రమంలో కాస్త విజయం సాధించినట్లే కనిపిస్తోంది. రఘురామపై అనర్హత పిటిషన్‌కి సంబంధించి విచారణ జరపాల్సిందిగా లోక్‌సభ ప్రివిలేజీ కమిటీని ఆదేశించారు స్పీకర్ ఓం బిర్లా.

ఇంకేముంది, రఘురామపై అనర్హత వేటు పడిపోయినట్లేనంటూ వైసీపీ శ్రేణులు ఫుల్ ఖుషీ అయిపోతున్నాయి. నిజమేనా.? రఘురామపై అనర్హత వేటు పడుతుందా.? టీడీపీ నుంచి బీజేపీలోకి దూకేసిన రాజ్యసభ సభ్యుల మీద అనర్హత వేటు పడలేదు. అలాంటప్పుడు, రఘురామ మీద ఎలా అనర్హత వేటు వేస్తారు.?

లోక్‌సభ వ్యవహారాన్ని పక్కన పెడదాం. ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, టీడీపీ నుంచి వైసీపీలోకి దూకేసిన టీడీపీ ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేశారా.? లేదు కదా.! ఇదే రఘురామ ధీమా.