తమిళనాట రాజకీయాలకు, సినీ రంగానికి చాలా దగ్గరి సంబంధం ఉంది. సినీ తారలు, రాజకీయ ప్రముఖులు కలిసికట్టుగా నడుచుకుంటూ ఉంటారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వారికి అనువుగా నడుచుకోవడం తమిళ హీరోల పాలసీ. బయటకు రావు కానీ సీఎం మారినప్పుడల్లా తమిళ హీరోల దృష్టి కూడ మారుతుంటుంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఎం.కే.స్టాలిన్ కొత్త ముఖ్యమంత్రిగా అవతరించారు. ఇప్పుడు ఆయనకు దగ్గరయ్యే పనిలో ఉన్నారు చాలామంది తమిళ సినీ ప్రముఖులు. అందుకే కరోనా మీద పోరాటం చేయడం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోట్ల విరాళాలు ఇస్తున్నారు.
ఇప్పటికే హీరో సూర్య, ఆయన సోదరుడు కార్తి తమ తండ్రితో కలిసి కొత్త సీఎం వద్దకు వెళ్లి కోవిడ్ విరాళం కింద కోటి రూపాయలు డోనేట్ చేశారు. దర్శకుడు మురుగదాస్ కూడ సీఎంను కలిసి 20 లక్షలు విరాళమిచ్చారు. ఇక ఇప్పుడు సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. ఈ జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉంది. కరోనా సెకండ్ వేవ్ చాలా నెలల నుండే ఉన్నా ఇప్పుడే హీరోలు ఇలా డోనేట్ చేయడం వెనుక రీజన్ ఉంది. ప్రభుత్వం మారబోతుందని ముందే అంచనా వేసిన హీరోలు ఇచ్చేది ఏదో కొత్తగా వచ్చే ముఖ్యమంత్రికి ఇస్తే అన్ని విధాలుగా బాగుంటుందని అనుకుని ఇప్పుడు బయటికొచ్చి విరాళాలు ఇస్తున్నారు. వారి ఉద్దేశ్యం ఏదైనా కోవిడ్ బాధితుల కోసం వారు చేస్తున్న సహాయం మాత్రం అభినందనీయం, అవసరం కూడ.