High Court : హైకోర్టు అమరావతి నుంచి కదిలే అవకాశాలు కన్పించడంలేదు. చంద్రబాబు హయాంలో నిర్మితమైన హైకోర్టు భవనంలో సౌకర్యాల లేమి నేపథ్యంలో అదనపు భవన నిర్మాణానికి నేడు శంకుస్థాపన జరగడంతో, రాయలసీమ వాసుల్లో హైకోర్టు విషయమై ఆందోళన పెరుగుతోంది.
వాస్తవానికి హైకోర్టు, అమరావతి నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల అయ్యే పని కాదు. అయినాగానీ, జ్యుడీషియల్ క్యాపిటల్ పేరుతో రాయలసీమ వాసుల్లో లేనిపోని ఆశల్ని వైఎస్ జగన్ సర్కార్ కల్పించి, భంగపడింది. మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతానికి అటకెక్కింది. ఇంతలోనే, హైకోర్టు అదనపు భవనానికి శంకుస్థాపన జరిగింది.
దాంతో, రాయలసీమ వాసులు.. ముఖ్యంగా కర్నూలు వాసులు హైకోర్టు కోసం ఆందోళన చెందుతున్నారు, ఆందోళనబాటపడుతున్నారు. వారికి సమాధానం చెప్పేదెవరు.? కర్నూలులో హైకోర్టు విషయమై బీజేపీ సానుకూలంగానే కనిపించింది గతంలో. కానీ, ఆ తర్వాత మాట మార్చింది.
బీజేపీని నమ్ముకుని మూడు రాజధానుల వ్యవహారంలో కర్నూలు ప్రజలకు ఆశలు కల్పించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. కర్నూలు పరిస్థితి ఇలా వుంటే, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖ వ్యవహారం కూడా అటకెక్కినట్టే. వాస్తవానికి అమరావతిని కాదని ఇలాంటి ప్రయత్నాలు చేయడమంటే నేల విడిచి సాము చేయడమే.
అమరావతిని కాస్తో కూస్తో అభివృద్ధి చేసి, ఆ తర్వాత పేర్లు పెట్టకుండానే అయినా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ హోదా విశాఖకీ, జ్యుడీషియల్ క్యాపిటల్ కర్నూలుకీ అన్నట్టుగా అభివృద్ధి చేసి వుంటే.. అసలు సమస్యే వచ్చేది కాదు.
రాయలసీమ వైసీపీకి బాగా పట్టున్న ప్రాంతం. అక్కడి ప్రజల విశ్వాసం కోల్పోయే పరిస్థితి వచ్చేసిందిప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి.
