Voter Card : ఆధార్ లేకుండా పని జరగడంలేదు. అన్నిటికీ అదే ఆధారం అవుతోంది. పలు సందర్భాల్లో ఈ ‘ఆధార్’ లింక్ వివాదాస్పదమవుతున్నాసరే, ఆధార్ లేకపోతే.. ఏ ఫనీ జరగని పరిస్థితులొచ్చేశాయి. తాజాగా, ఓటరు కార్డునీ ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం చట్ట సవరణ బిల్లుని కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది.
దేశంలో అన్నిటికన్నా పెద్ద జాడ్యం రాజకీయ అవినీతి. ఎన్నికల వేళ ఓటుకు నోటుతోనే అవినీతికి తెరలేస్తోంది. అక్కడి నుంచి అన్నింటా అవినీతే. ఓటుని రెండు వేలకో, పది వేలకో కొనుగోలు చేసే రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల అభ్యర్థులు.. గెలిచాక, ప్రజలకు సేవ చేస్తారని ఎలా అనగలం.?
ఓటరు కార్డుని ఆధార్తో అనుసంధానం చేయడం కంటే ముందు, రాజకీయాల్లో అవినీతిని నిర్మూలించే దిశగా చర్యలు చేపట్టాల్సి వుంది. కానీ, అలా చేస్తే.. అసలు రాజకీయ వ్యవస్థ మనుగడ సాధించే అవకాశమే లేదు. కారణం, రాజకీయం నడుస్తున్నదే అవినీతి పునాదుల మీద.. అన్నట్టుగా తయారైంది పరిస్థితి.
ఆ పార్టీ ఈ పార్టీ అన్న తేడాల్లేవు.. అన్ని రాజకీయ పార్టీలూ అవినీతి పునాదుల మీదనే మనుగడ సాధించాల్సిన దుస్థితి ఏర్పడింది మరి. ఎన్నికల్లో సంస్కరణలంటూ.. ఆధార్తో ఓటరు ఐడీ కార్డుని అనుసంధానం చేయడం వల్ల ఉపయోగం వుండదు. మరింతగా, రాజకీయ అవినీతి పెరగడం తప్ప.. అన్న పెదవి విరుపులు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
పెద్ద నోట్ల రద్దుతో అసలు దేశంలో అవినీతే వుండదని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు. కానీ, ఏమయ్యింది.? అవినీతి రెట్టింపయ్యింది.. కాదు కాదు పదింతలయ్యింది. ఇప్పుడీ ఆధార్ – ఓటరు కార్డు అనుసంధానంతోనూ అంతే.
