భారతదేశంలో పుట్టడం నా అదృష్టం: నిర్మలా సీతారామన్‌!

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఢిల్లీ వసంత కుంజ్ లోని ఫోర్టిస్ ఆసుపత్రిలో గురువారం ఆమె కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోస్‌ను స్వీకరించారు. అనంతరం సీతారామన్‌ మాట్లాడుతూ భారతదేశంలో ఉండటం తన అదృష్టం ఇందుకు తనకు గర్వంగా ఉందంటూ అంటూ వ్యాఖ్యానించారు. అలాగే ఎంతో నైపుణ్యంతో తనకు టీకా వేసిన నర్స్‌ రమ్యకు థ్యాంక్స్‌ చెప్పారు. వ్యాక్సిన్‌ అభివృద్ధి, పంపిణీ, సరైన సమయంలో, సరసమైన ధరలో టీకా లభిస్తున్న దేశంలో పుట్టడం తన అదృష్టం అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా దేశంలో ప్రస్తుతం రెండో దశ వ్యా క్సినేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. 60 ఏళ్లుదాటినవారికి, 45 సంవత్సరాలు పైబడి, అనారోగ్యంతో ఉన్న వారికి ఈ దశలో వ్యాక్సిన్‌ అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ సహా పలు కేంద్ర మంత్రులు, కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర రంగాల దిగ్గజాలు టీకాను వేయించుకున్నారు.

భార‌త్‌లో క‌రోనా కేసులు మళ్లీ పెరుగుతున్న పోకడ కనిపిస్తోంది. కొత్త‌గా మొన్న క‌రోనా కేసులు 12,286 గా న‌మోదు కాగా, నిన్న 14,989 కేసులు న‌మోద‌య్యాయి. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా నిర్ధారణ అయింది. దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో అదే స‌మ‌యంలో 14,031 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,56,923కు చేరింది. గడచిన 24 గంట‌ల సమయంలో 89 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,435కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,08,26,075 మంది కోలుకున్నారు. ఇప్ప‌టివ‌ర‌కు 1,66,16,048 మందికి వ్యాక్సిన్ వేశారు.