ఒక్క ఊరపిచ్చుక కోసం 45 రోజులుగా కరెంటుకు దూరంగా….. గ్రామస్తులపై ప్రశంసల జల్లు

sparrow
sparrow
sparrow

ఒకప్పుడు ఊర పిచ్చుకలు ఇళ్ల మధ్యనే జీవనం సాగించేవి. పల్లెల్లో బయటకొస్తే వందల్లో కనిపించేవి. ఎప్పుడైతే సాగులో పురుగు మందుల వాడకం మొదలైందో అప్పట్నుంచి ఊర పిచ్చుకల పతనం ప్రారంభమైంది. పురుగు మందుల దాటికి ఊరపిచ్చుక జాతే అంతమయ్యే స్థితికి చేరింది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్క ఊర పిచ్చుక కోసం గ్రామస్తులు 45 రోజులపాటు వీధి దీపాలు వెలిగించుకోకుండా ఉండటంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. తమిళనాడు రాష్ట్రం శివగంగై జిల్లా పెద్దపూడి గ్రామానికి 45 రోజులకు ముందు ఎక్కడి నుంచో ఓ పిచ్చుక వచ్చింది. ఆ ఊరి వీధిదీపాల మెయిన్ స్విచ్ బోర్డులో దూరింది.వెంటనే అక్కడ గూడుకట్టుకోవడం మొదలు పెట్టింది.

ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు కరెంటు ఆఫీసర్లను పిలిచి పిచ్చుక గూడును కదిలిస్తే చెదిరి పోతుందని చెప్పి ఇకపై వీధి దీపాలను వెలిగించనక్కర లేదని చెప్పారు. కొద్దిరోజుల తర్వాత ఆ పిచ్చుక మెయిన్ స్విచ్ బోర్డులో మూడు గుడ్లు పెట్టి పొదుగగా రెండు పిల్లలు జన్మించాయి. దీంతో పెద్దపూడి గ్రామస్తుల ఆనందానికి హద్దేలేకుండా పోయింది. పక్షి పిల్లలకు రెక్కలు వచ్చి ఎగిరిపోయేంత వరకు ఆ మెయిన్ స్విచ్ జోలికి వెళ్లకూడదని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. 45 రోజులుగా ఆ ఊరి ప్రజలు రాత్రి పూట వీధుల్లో కరెంటు దీపాల వెలుతురు లేకుండానే రాకపోకలు సాగించారు. ఆ గ్రామస్తులు పిచ్చుకపై చూపుతున్న ప్రేమపై సోషల్ మీడియాలో వీడియోలు రావడంతో పక్షి ప్రేమికులైన ఆ గ్రామస్తులను అందరూ అభినందిస్తున్నారు.