Chilakaluripet: దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే నిద్రించిన దొంగ.. పోలీసులు గుడ్ మార్నింగ్ చెప్పేసరికి షాక్..!

Chilakaluripet: ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లాలంటే చాలు దొంగలు పడ్తరేమో అనే భయం అందరిలో ఉంటుంది. దొంగతనం చేసే వారు ఎక్కడెక్కడ ఇంటికి తాళాలు వేశారో అని గమనించి ఇంట్లో ఎవరూ లేరు అని నిశ్చయించుకొని దొంగతనానికి వెళ్తుంటారు. ముఖ్యంగా పట్టణాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతుంటాయి. దొంగతనం చేయడం కూడా ఒక కళ ,ఎంతో నేర్పుతో ఎవరికీ పట్టుబడకుండా చాకచక్యంగా దొంగతనం చేయాలంటే ఎంతో ధైర్యం ఉండాలి.

కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అదృష్టం కలిసి రానప్పుడు ఎంతటి ఘరానా దొంగలు అయిన పట్టు పడిపోతుంటారు. ఇటీవల చిలకలూరిపేట పట్టణంలో ఇలాంటి ఒక సంఘటన చోటు చేసుకుంది. దొంగతనానికి వచ్చి దర్జాగా ఆ ఇంట్లోనే నిద్రపోయి పోలీసులకు పట్టుబడ్డాడు.చిలకలూరిపేట పట్టణంలోని పండరీపురం ఐటీసీ గోదాము ఎదురుగా ఉన్న ఇంట్లో వాళ్ళు తాళం వేసి కొంత కాలం క్రితం అమెరికాకు వెళ్లారు. ఇది గమనించిన ఒక దొంగ ఇంట్లోకి చొరబడి, తన తెలివితో ముందుగా ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ద్వంశం చేశాడు, తర్వాత ఇల్లంతా వెతికి విలువైన వస్తువులు ఏమి దొరకక పోవడంతో నిరాశ చెందాడు.

అలసట వల్ల దొంగతనానికి వచ్చిన ఇంట్లోనే దర్జాగా నిద్రపోయాడు. మర్నాడు ఉదయం ఇంటి తలుపులు తెరిచి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఆ ప్రదేశానికి చేరుకుని దొంగ దారిలోనే ఇంట్లోకి వెళ్లి చూడగా ఆశ్చర్యానికి లోనయ్యారు. అక్కడ మంచం మీద దొంగ నిద్రపోతూ ఉండటంతో దొంగ చేతికి బేడీలు వేసి గుడ్ మార్నింగ్ చెప్పేసరికి షాక్ అవ్వటం దొంగ వంతయింది. దొంగతనానికి పాల్పడిన వ్యక్తి విజయవాడకి చెందిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ మొదలుపెట్టారు.