తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2.3 లక్షల కోట్లు..రైతులపై వరాల జల్లు

తెలంగాణ బడ్జెట్ 2021-22ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు గురువారం ప్రవేశపెట్టారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం రూ.2,30,825.96 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,69,383.44 కోట్లుగా హరీశ్ రావు పేర్కొన్నారు. ఏడేళ్ల వయసున్న తెలంగాణ అనేక సమస్యలు ఎదుర్కొందని, వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నట్లు హరీశ్ రావు అన్నారు. కరోనా సమయంలో ఆ మహమ్మారి విసిరిన సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొన్నామని అన్నారు. ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేరుస్తోందని అన్నారు. కరోనా వ్యాక్సిన్ రాకతో ఆర్థిక వృద్ధి క్రమంగా పెరుగుతోందని అన్నారు.

Telangana Budget: రైతులపై వరాల జల్లు.. వ్యవసాయరంగానికి కేటాయింపులు ఇవే

‘‘2019లో 13.5 శాతం నుంచి 1.3 శాతానికి డీఎస్‌డీపీ వృద్ధి తగ్గింది. అయినా కేసీఆర్ ముందు చూపుతో చేసిన సంక్షేమ కార్యక్రమాల వల్ల 2021లో ప్రాథమిక రంగం అంచనాలో 17.7 శాతం వృద్ధి నమోదు చేసింది. దేశ ఆదాయం తగ్గిన పరిస్థితుల్లోనూ తెలంగాణలో మంచి ఆదాయం ఉంది. తెలంగాణ ప్రబల శక్తిగా ఎదుగుతుందని చెప్పడానికి ఇది నిదర్శనం. గ్రామాల్లో పారిశుద్ధ్యం పెంపొందించేందుకు పల్లె ప్రగతి పేరుతో కార్యాచరణ ప్రకటించాం. ఇది గ్రామీణ ముఖ చిత్రాన్ని మార్చేసింది.

గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.29,271 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల నియోజకవర్గ అభివృద్ధికి రూ.5 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వీటికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తాం. దీనికి మొత్తం రూ.800 కోట్లు కేటాయించింది. సీఎం దళిత్ ఎంపవర్ మెంట్ పేరుతో కొత్త పథకానికి రూ.వెయ్యి కోట్లు కేటాయించాం. అని హరీశ్ రావు వెల్లడించారు.

వ్యవసాయ రంగానికి సంబంధించి ముఖ్యాంశాలు:

ఆయిల్ పామ్ పంట వేసే రైతులకు ఎకరాకు రూ.30వేలు సబ్సిడీ. మిగిలిన పెట్టుబడి కూడా బ్యాంకుల నుంచి రుణం.

పంటలను ఆరబెట్టేందుకు లక్ష మంది రైతులకు రూ.750 కోట్లు కేటాయింపు.

ఈ ఆర్థిక సంవత్సరం వ్యవసాయ యాంత్రీకరణకు రూ.1500 కోట్లు

ఈ ఏడాది రైతు బంధు కోసం రూ.14,800 కోట్లు కేటాయింపు

గతంలో రూ.25వేల లోపు ఉన్న రుణాల మాఫీ. మిగతా రైతుల రుణమాఫీ కోసం రూ.5225 కోట్లు.

గుంట భూమి ఉన్నా బీమా వర్తింపు. ఈ ఏడాది రైతు బీమా కోసం రూ.1200 కోట్లు.

పశు సంవర్ధకశాఖ, మత్సశశాఖకు బడ్జెట్‌లో రూ.1,730 కోట్లు కేటాయింపు.