అది ఏ పార్టీ అయినా సరే.. ఆ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడాలని.. ఆ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కొందరు నాయకులకు పెద్ద పెద్ద పదవులను కేటాయిస్తారు. ప్రమోషన్లు ఇస్తారు. పార్టీ కోసం కష్టపడే వాళ్లను గుర్తిస్తారు. వాళ్లు పార్టీని ముందుకు తీసుకెళ్తే.. ఖచ్చితంగా వాళ్లకు పార్టీలో ఎప్పటికీ గౌరవం ఉంటుంది. ఆ పార్టీ అధికారంలోకి వస్తే.. వాళ్లకు మంచి మంచి పదవులు కూడా దక్కుతాయి.

ఇఫ్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ప్రస్తుతం టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. సరే.. 2019 వరకు అధికారంలో ఉన్న పార్టీయే. అప్పుడు టీడీపీ నేతల్లో చాలామంది ఎన్నో పదవులను అనుభవించారు. ఇప్పుడు టీడీపీకి గడ్డుకాలం. ఈ పరిస్థితుల్లో టీడీపీకి అండగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే.. అప్పుడు పదవులను అనుభవించి.. ఇప్పుడు మాత్రం కిక్కమనకుండా ఉంటూ.. పార్టీని పట్టించుకోకుండా ఉంటున్న నేతలు చాలామంది టీడీపీలో ఉన్నారు.
ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే.. పార్టీ ప్రస్తుతం అధికారంలో లేకున్నా కూడా చంద్రబాబు నాయుడు కొందరు నేతలకు పదవులు ఇచ్చారు. పదవులు పొందిన నేతలు పార్టీ కోసం అంతో ఇంతో శ్రమించాల్సి ఉంటుంది.
అలాగే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ టీడీపీ నాయకురాలు తోట సీతారామలక్ష్మీ మాత్రం ఎందుకో టీడీపీపై కాస్త నిరాశతో ఉన్నారు. నిజానికి ఆమె 2005 లో భీమవరం మున్సిపల్ చైర్మన్ గా పనిచేశారు. 2009లో చంద్రబాబు నాయుడు ఆమెకు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలను అప్పగించారు. అంతే కాదు.. నరసాపురం ఎంపీ సీటు కూడా ఇచ్చారు.
2014లో చంద్రబాబు నాయుడు.. సీతారామలక్ష్మీని రాజ్యసభ ఎంపీని చేశారు. ఆమెను నమ్మి ఎన్నో పదవులను కట్టబెట్టినా… పార్టీ కోసం మాత్రం ఆమె ఏం చేయలేదనే అపవాదును పొందారు. గత ఎన్నికల్లో కూడా ఆమె అంతగా పార్టీ గెలుపు కోసం చేసిందేమీ లేదని జిల్లా టీడీపీ తమ్ముళ్లు చెబుతున్నారు.
అయితే.. గత ఎన్నికల్లో భీమవరం ఎమ్మెల్యే సీటును తన కొడుకుకు ఇవ్వాలంటూ ఆమె పట్టుబట్టారు. చంద్రబాబు నాయుడు మాత్రం ఆమె కొడుకుకు ఎమ్మెల్యే సీటు ఇవ్వలేదు. దీంతో ఆమె పార్టీ పట్ల ముభావంగా ఉన్నారు.
పార్టీ ఎన్నికల్లో ఓడిపోయాక.. ఆమె మాత్రం పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదు. అయితే.. ఆమెకు బీజేపీ నుంచి ఆహ్వానం కూడా అందింది. కానీ.. టీడీపీ నుంచి మాత్రం వెళ్లేది లేదని చెబుతున్న సీతా… పార్టీ కోసం మాత్రం ఏం చేయడం లేదు.
బీజేపీ పిలిచినా నేను వెళ్లట్లేదు. నాకు టీడీపీ అంటే అంత అభిమానం.. అంటూ చెప్పుకుంటున్నారే తప్ప.. పార్టీ కోసం మాత్రం అంతగా పనిచేయడం లేదు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చాలామంది టీడీపీ నేతలు వైసీపీ పార్టీలోకి జంప్ అవడానికి ప్రయత్నిస్తున్నా.. సీతారామలక్ష్మీ మాత్రం తనకేమీ తెలియదన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదే ఇప్పుడు పశ్చిమ గోదావరి టీడీపీ నేతల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇన్ని పదవులు ఇచ్చినా కూడా పార్టీ పట్ల ఆమె ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపిస్తున్నారో అర్థం కావడం లేదంటూ చెప్పుకుంటున్నారు.
