Crime News: గంజాయి మత్తులో విచక్షణా రహితంగా దాడి..విషమ పరిస్థితుల్లో బాధితుడు..!

Crime News: ఈ రోజుల్లో చిన్న, పెద్ద అని వయసు వ్యత్యాసం లేకుండా చెడు వ్యసనాలకు బానిస అవుతున్నారు. మందు, సిగరెట్,గంజాయి వంటి వాటికి బానిస అవుతున్నారు. ఈ అలవాట్ల వల్ల వారి, వారి కుటుంబ సభ్యులు ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఇలాంటి చెడు అలవాట్లకు బాగా అలవాటు పడటం వల్ల కొందరు ఆరోగ్యం దెబ్బతిని మరణిస్తున్నారు, మరికొందరు మాత్రం వాటి మధ్యలో పడి విచక్షణా రహితంగా ఇతరులపై దాడికి దిగుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన ఒకటి వెలుగు చూసింది.

కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగంపల్లి గ్రామంలో గంజాయికి వెల్దండి రవి అనే వ్యక్తి ప్రతి రోజు గంజాయి తీసుకుంటూ దానికి బానిస అయ్యాడు. గంజాయి మత్తులో పడి పక్క ఇంట్లో నివాసముంటున్న
జక్కని అశోక్ (35) పై విచక్షణారహితంగా గొడ్డలితో మెడపై,తలపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా అశోక్ శరీరంపై కారంపొడి కూడా చల్లాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన అశోక్ ని తన కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అశోక్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ విషయం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రూరంగా వ్యవహరించిన రవిని అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. దాడికి సంబంధించిన విషయాల గురించి పోలీసులు విచారణ చేయగా దాడి వెనుక ఎటువంటి కారణాలు లేవని స్థానికులు చెబుతున్నారు. కాగా రవి ప్రతిరోజు గంజాయి తీసుకుంటూ తన ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాడని పోలీసులకు సమాచారం అందించారు. గంజాయి వాడకానికి అడ్డుకట్ట వేయాలని పోలీసులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఇలాంటి వారు ఏదో విధంగా వాటిని సంపాదించి ఇలా ఘోరానికి పాల్పడుతున్నారు.