టీడీపీకి మేలు చేస్తున్న వైఎస్ షర్మిల.!

YS Sharmila Helping TDP

YS Sharmila Helping TDP

వైఎస్ షర్మిల, తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించిన విషయం విదితమే. వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో నిన్ననే కొత్త పార్టీని ఆమె ప్రారంభించారు. ఈ క్రమంలో టీడీపీ అనుకూల మీడియా నుంచి షర్మిలకి విపరీతమైన మద్దతు లభించింది. రాజకీయ, మీడియా వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాల ప్రకారం చూస్తే, పార్టీ లాంఛింగ్ కోసం టీడీపీ అనుకూల మీడియాకి ప్రకటనల రూపంలో పెద్ద మొత్తంలోనే షర్మిల ఖర్చు చేశారట.

ప్రధానంగా వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ మీడియా సంస్థల్ని అయితే బ్లాక్ లిస్టులో పెట్టి, ప్రకటనలు వెళ్ళకుండా, ఆయా ఛానళ్ళ ఆర్థిక మూలాల్ని దెబ్బ తీస్తోందో, ఆ మీడియా సంస్థలకు ప్రస్తుతం షర్మిల పార్టీ ప్రధాన ఆదాయ వనరుగా మారిందని అంటున్నారు. మరోపక్క, షర్మిల నిన్నటి పార్టీ ప్రారంభోత్సవ ప్రసంగంలో టీడీపీకి మేలు చేసేలా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

వైఎస్ జగన్, కేసీయార్.. ఇద్దరూ కలిసి ఉమ్మడి శతృవు అయిన టీడీపీని ఓడించారనీ, ఆ స్నేహం రాష్ట్రంలో జల వివాదాల సమస్య పరిష్కారం కోసం ఉపయోగపడటంలేదని షర్మిల విమర్శించిన విషయం విదితమే. ఈ వ్యాఖ్యల్ని టీడీపీ అనుకూల మీడియా ఎక్కువగా ప్రొజెక్ట్ చేస్తోంది.

తద్వారా టీడీపీకి అదనపు పొలిటికల్ మైలేజ్.. అదీ ఉచితంగా లభిస్తోంది. అదొక్కటే కాదు, వైఎస్సార్ మీద తెలంగాణ నాయకులు తిట్ల వర్షం కురిపిస్తున్నా, ఏపీకి చెందిన నాయకులు.. అందునా వైఎస్సార్ రాజకీయ భిక్షతో ఎదిగినవారు స్పందించకపోవడంపైనా షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ‘చేతులకు గాజులు తొడుక్కున్నారా.? సిగ్గు లేదా.?’ అని షర్మిల ప్రశ్నించడంపైనా టీడీపీ అనుకూల మీడియా తన మార్కు ముద్ర వేసి, వాటిని వైఎస్సార్సీపీకి అన్వయిస్తుండడం గమనార్హం.

ఇంతకీ, వైఎస్ షర్మిల కావాలనే ఇదంతా చేస్తున్నారా.? టీడీపీ అనుకూల మీడియాని ప్రసన్నం చేసుకునే క్రమంలో వైఎస్సార్సీపీని ఆమె దెబ్బకొడుతున్న వైనం పట్ల వైసీపీ స్పందన ఎలా వుండబోతోంది.? వేచి చూడాలిక.