
తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్ళింది రష్మిక మందన్న. రెండు హిట్లు అందుకోగానే వెంటనే పెద్ద హీరోల సినిమాల్లో ఆమెకు ఆఫర్లు మొదలయ్యాయి. ఏకంగా మహేష్ బాబుతోనే నటించేసి హాట్ షాట్ అయింది. ఇంత వేగంగా స్టార్ హీరోయిన్ అవుతానని రష్మీక మందన్న కూడ ఊహించి ఉండదు. కాలం కలిసొస్తే అంతే మరి. ప్రజెంట్ ఆమె తెలుగులో అల్లు అర్జున్ సరసన ‘పుష్ప’ చిత్రం చేస్తోంది. ఇది రష్మిక చేస్తున్న మొదటి పాన్ ఇండియా చిత్రం. ఇందులో నటించడం నిజంగా రష్మిక కెరీర్ కు చాలా ఉపకరించే విషయం.
అయితే ఇన్నిరోజులు కథలో రష్మిక మందన్నే ఏకైక హీరోయిన్ అనుకున్నారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. సినిమాను రెండు భాగాలు చేశారు. అసలు ‘పుష్ప’లో రెండు భాగాలు అయ్యేంత కథ ఉందా అనేదే అందరికీ కలుగుతున్న అనుమానం. మధ్యలో వచ్చిన ఈ రెండు భాగాల ఆలోచన కథను కూడ మార్చేసిందట. మొదటి భాగానికి ఎలాగూ స్టఫ్ ఉంది కాబట్టి రెండవ పార్ట్ కోసమే కథను సాగదీయాల్సి ఉంటుంది. అందుకే రెండవ భాగంలో కొత్త కథానాయికను దింపి ఫ్రెష్ ట్రాక్ పెడితే బాగుంటుందని సుకుమార్ అనుకుంటున్నారట. దీంతో రష్మిక మందన్న క్యారెక్టర్ మొదటి భాగానికే పరిమితమై కథ మధ్యలోనే ముగుసేలా కనిపిస్తోంది.
