Road Accident: విశాఖలో బొలిరోని ఢీ కొట్టిన లారీ..ఘటనలో ఇద్దరు మృతి.. ఒకరికి తీవ్ర గాయాలు..!

Road Accident: దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. ప్రమాదాలను అరికట్టడానికి పోలీసులు ఎన్ని కఠిన చర్యలు అమలు చేసినా వాహనాన్ని నడిపే వారి నిర్లక్ష్యం, అజాగ్రత్త వల్ల ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతిరోజు వందల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోతున్నారు. రద్దీగా ఉండే విశాఖపట్నం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో, లారీ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు, మరొక వ్యక్తి తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లాలో ఎలమంచిలి పెట్రోల్ బంకు సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బొలెరో వాహనాన్ని ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు స్పాట్ లోనే చనిపోయారు, వారితో పాటు ప్రయాణిస్తున్న మరొక వ్యక్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారు పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామానికి చెందిన వారిగా పోలీసులు తెలిపారు. గాయపడిన మరొక వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.