Accident: జమ్మూకాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడి అక్కడికక్కడే ఐదుగురు దుర్మరణం..!

Accident:దేశంలో రోజురోజుకీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి రోజూ ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాహనాన్ని నడిపే వారు మితిమీరిన వేగంతో వాహనాన్ని నడపడం వల్ల ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాహనాన్ని నడిపే వారి నిర్లక్ష్యం వల్ల ఏ పాపం ఎరుగని వారు వారి కుటుంబ సభ్యులకు దూరమవుతున్నారు. తాజాగా ఇటువంటి సంఘటన శనివారం ఉదయం జమ్మూ కాశ్మీర్ లో చోటుచేసుకుంది. కారు లోయలో పడి ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్మూకాశ్మీర్లోని సాంబా జిల్లాలోకి ఘాట్ రోడ్ లో ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి లోయలో పడిపోయింది.ఎస్‌యూవీ వాహనం పంజాబ్​నుంచి శ్రీనగర్​ వెళ్తుండగా మాన్సార్​సమీపంలోని జమోదా ప్రాంతంలో లోయలో పడిపోయింది.ఈ సమాచారం గురించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా ఒక వ్యక్తి తీవ్ర గాయాలపాలైనట్లు పోలీసులు వివరించారు.

ఈ ప్రమాదంలో కారు మొత్తం పూర్తిగా పాడైపోయింది అని పోలీసులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన వారిని పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు .