వివాదాస్పద వ్యాఖ్యలు చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మీద కేసులు నమోదయ్యాయి. ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి, కోర్టులో హాజరు పరిచారు, న్యాయస్థానం రిమాండ్ విధించింది.. బెయిల్ తిరస్కరణకు గురైంది.. అంతలోనే బెయిల్ వచ్చింది.
పోలీసులు పద్ధతి ప్రకారం అరెస్టు చేయలేదనీ, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదనీ రాజాసింగ్ తరఫు న్యాయవాది న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళడంతో, ఆ వ్యాఖ్యలతో ఏకీభవించిన న్యాయస్థానం, రాజా సింగ్కి బెయిల్ మంజూరు చేసిందట. ఇది నిన్నటి వ్యవహారం.
రాజా సింగ్, బీజేపీ నుంచి సస్పెండ్ అవడం పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలంటూ షోకాజ్ నోటీసులు జారీ అవడం.. ఇవన్నీ నిన్ననే చకచకా జరిగిపోయాయి. ఇదంతా హైడ్రామా అని అంతా ముందే అనుకున్నారు. ఎవరికీ రాజాసింగ్ అరెస్టు విషయంలో సీరియస్నెస్గానీ, సస్పెన్షన్పై చిత్తశుద్ధిగానీ కనిపించలేదు.
అరెస్టయ్యారు, విడుదలయ్యారు. పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు, తిరిగి బీజేపీలోనే కొనసాగనున్నారు. ఔను, ఇదే విషయాన్ని చూచాయిగా రాజాసింగ్ సెలవిచ్చారు. తాను ఏ మతం మీదా ప్రత్యేకించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదని రాజా సింగ్ తాజాగా సెలవిచ్చారు. ఇదే విషయాన్ని పార్టీ క్రమశిక్షణా కమిటీకి కూడా వివరణ రూపంలో తెలియజేశానని అన్నారు.
‘నన్ను పార్టీ వదులుకుంటుందని అనుకోవడంలేదు. బండి సంజయ్ నాయకత్వం పట్ల నాకు సంపూర్ణ విశ్వాసం వుంది. బీజేపీలోనే కొనసాగుతాను..’ అంటూ రాజా సింగ్ తాజాగా వ్యాఖ్యానించారు. ‘నా వివరణతో పార్టీ సంతృప్తి చెందుతుందని భావిస్తున్నాను..’ అని రాజాసింగ్ వ్యాఖ్యానించడం కొసమెరుపు.
అంటే, అంతా ఓ స్క్రిప్టు ప్రకారమే జరిగిందని అనుకోవాలేమో. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి హేమాహేమీలు ఓడిపోయినా, రాజాసింగ్ మాత్రమే గెలిచారు. అప్పటికి ఆయన ఒకే ఒక్క ఎమ్మెల్యే.. బీజేపీ నుండి. ఆ తర్వాత ఉప ఎన్నికల పుణ్యమా అని బీజేపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేలు దక్కారు.
